31, ఆగస్టు 2013, శనివారం

ద్వితీయస్కంధం: 05. శ్రీమహావిష్ణువు విరాట్ స్వరూపం

అమోఘప్రభావుడైన శుకయోగీంద్రుడు ఇప్పుడు పరీక్షిత్తుకు శ్రీమహావిష్ణువు యొక్క విరాట్ స్వరూపాన్ని వివరిస్తున్నాడు.

1 పాదాల అడుగు భాగం పాతాళం
2 మడమలు, పాదాల వేళ్ళు రసాతలం
3 చీలమండలు మహాతలం
4 పిక్కలు తలాతలం
5 మోకాళ్ళు సుతలం
6 తొడల దిగువ భాగం వితలం
7 తొడల పైభాగం అతలం
8 పిరుదులు భూలోకం
9 నాభి ఆకాశం
10 వక్షస్థలం నక్షత్రలోకం
11 మెడ మహర్లోకం
12 ముఖము జనలోకం
13 నుదురు తపోలోకం
14 తల సత్యలోకం
15 బాహువులు ఇంద్రాది దేవతలు
16 చెవులు దిక్పతులు
17 వినికిడి శక్తి శబ్దం
18 ముక్కుపుటాలు అశ్వనీదేవతలు
19 వాసన శక్తి వాసన
20 నోరు అగ్ని
21 కన్నులు అంతరిక్షం
22 చూపు సూర్యుడు
23 కనురెప్పలు రాత్రింబవళ్ళు
24 కనుబొమలు బ్రహ్మము
25 అంగిలి జలములు
26 రుచి చూచే శక్తి రుచి
27 బ్రహ్మరంధ్రం వేదం
28 కోరలు యముడు
28 దంతాలు పుత్రుడు మొదలైన వారిపై మమకారం
30 నవ్వులు జీవులకు భ్రమగొల్పే మాయలు
 31 కడగంటి చూపులు అనంతమైన సృష్టి క్రమాలు
32 పెదవులు సిగ్గు, లోభం
33 స్తనాలు ధర్మమార్గాలు
34 వీపు అధర్మమార్గం
35 పురుషాంగం ప్రజాపతి
36 వృషణాలు మిత్రావరుణులు
37 కడుపు సముద్రాలు
38 ఎముకలు పర్వతాలు
39 నాడులు, రక్తనాళాలు నదులు
40 వెంట్రుకలు చెట్లు
41 నిశ్వాసం వాయుచలనం
42 ఆద్యంతాలు లేని కాలం వయస్సు
43 కర్మములు జీవుల చావు పుట్టుకలు
44 జుట్టు మేఘమండలం
45 వస్త్రములు సంధ్యలు
46 హృదయం మూలప్రకృతి(ప్రధానం)
47 మనస్సు చంద్రుడు
48 చిత్తము మహత్తత్త్వం
49 అహంకారం రుద్రుడు
50 గోళ్ళు గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు
51 మొల పశుసంపద
52 వాక్కుల చమత్కారం పక్షులు
53 బుధ్ధి మనువు
54 నివాసం పురుషుడు
55 సప్తస్వరాలు గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు
56 స్మరణ శక్తి ప్రహ్లాదుడు
57 శక్తిసామర్థ్యాలు దైత్యదానవులు
58 ముఖం బ్రాహ్మణులు
59 భుజాలు క్షత్రియులు
60 తొడలు వైశ్యులు
61 పాదాలు శూద్రులు
62 నామధేయాలు (పేర్లు) వసురుద్రాది దేవతల పేర్లు
63 ధనసంపద యజ్ఞములలోని హవిస్సులు
64 సత్కర్మలు యజ్ఞములు


ఇందులో చెప్పబడిన వాటిలో మొదటి ఏడూ (పాతాళాది అతల పర్యంతం) అధోలోకాలు.  తర్వాతి ఏడూ (భూలోకాది సత్యలోక పర్యంతం)ఊర్ధ్వలోకాలు  ఈ పద్నాలుగూ లోకాలు.

ఇవే కాక మరొక యాభై లక్షణాలు చెప్పబడ్డాయి.  వీటితో పరమేశ్వరుడి దివ్యవిగ్రహం ఏర్పడుతోంది.  వీటిలో‌ కొన్ని దేహం యొక్క విభాగాలుగా ఉన్నాయి. కొన్ని ఆ విరాడ్విగ్రహం  యొక్క శక్తి స్వరూపాలు.  మరికొన్నింటితో అంతఃకరణ చతుష్టయం.  మరొకొన్ని  వర్ణాశ్రమ విభాగాలు. ఇంకా తదితర విశేషాలూ ఉన్నాయి.

పరిమితం అయిన మానవ ప్రజ్ఞని అపరిమితం అయిన శ్రీమన్నారాయణుడి బ్రహ్మాండ విగ్రహంలో న్యాసం చేయటమే ధారణ అని మనం తెలుసుకోవాలి.  ఇలా ధారణ చేయటం వలన అహంకారం పటాపంచలౌతుంది.

మహభారతంలో విష్ణుసహస్రనామం ఉంది కదా.  దాని యొక్క ధ్యాన శ్లోకంలో భూఃపాదౌ యస్య నాభిః వియత్... అంటూ చెప్పబడింది.  ఇక్కడ  ఈ విరాడ్విగ్రహ వర్ణనలో భూమి పాదంగా కాక, పిరుదులుగా చెప్పబడింది.  ఇక్కడ ఈ‌ బేధానికి ఒక రకంగా సమర్థన చెప్పవలసి వస్తుంది.  సాధకుడు సిధ్ధాసనం వేసుకుని కూర్చుంటాడు కదా.  అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాదాలు పిరుదులకు సోకి ఉంటాయి.  ధ్యానశ్లోకంలో వేరుగా చెప్పటానికి అదే కారణం అనుకోవాలి.

శుకయోగి ఇంకా ఇలా నిష్కర్ష చేస్తున్నారు.


కం. హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పని లే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే


ఓ మహారాజా, ఈ విశ్వం అంతా  శ్రీహరితో నిండి ఉంది.  అలాగే శ్రీహరి కూడా విశ్వం అంతా నిండి ఉన్నాడు.  ఇలా శ్రీహరితో నిండి కనిపించని ద్రవ్యం అంటూ ఒక్క పరమాణువు కూడా విశ్వంలో లేనేలేదు.

30, ఆగస్టు 2013, శుక్రవారం

ద్వితీయస్కంధం: 04. ధారణను గూర్చి శుకయోగి వివరించుట.

పరీక్షిత్తు శుకయోగి ముందు ధారణకు సంబధించిన తన సందేహాలని అడిగాడు

ధారణ అంటే ఏమిటీ?
ఆ ధారణ స్వరూపం‌ ఎలా ఉంటుంది?
ఆ ధారణ ఎలా నిలబడుతుంది?
ఆ  ధారణ ఏ విధంగా మనస్సు నుండి మలినాన్ని తొలగిస్తుంది?

అప్పుడు శుకయోగి విషయాన్ని విపులంగా చెబుతున్నారు.

ఆ. పవనము నియమించి పరిహృత సంగుడై
యింద్రియముల వర్గ మెల్ల మాపి
హరి విశాల రూపమందుఁ  జిత్తము జేర్చి
నిలుప వలయు బుధ్ధి నెఱపి బుధుడు

రాజా, ముందు వాయువును చక్కగా నియంత్రించాలి.  అలా చేయటం వలన సంసారంతో సాంగత్యం వదిలిపెట్ట వచ్చును. ఎప్పుడైతే సంసారం పట్ల ఆసక్తి వదిలి పోతుందో అప్పుడు ఇంద్రియాలకు చేయవలసిన పని ఏమీ ఉండదు.  ఇంద్రియాలు ప్రాపంచిక విషయాల మీద ధ్యాస పెట్టేలా మనస్సుని అటూ ఇటూ లాగటం ఆగిపోతుంది దానితో.  ఇంక మనస్సును శ్రీహరి యొక్క సువిశాలమైన స్వరూపం మీద నిలబెట్టాలి.  సాధకుడు ఇలా చేయాలంటే బుధ్ధిని సక్రమంగా వినియోగించు కోవాలి.

ఎవరికైనా,  ఈ వాయువు ఏమిటీ, దానినీ నియంత్రించటం ఏమిటీ, అదెలా అనే సందేహాలు రావచ్చును.  ఇక్కడ వాయువు అని చెప్పబడింది పంచప్రాణవాయువుల సమాహారం.  

పంచప్రాణవాయువులు అంటే ఇప్పటికే‌ చెప్పుకున్నాం, అవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు.  ప్రాణ వాయువుకు స్థానం హృదయం.  ఇది జీవుడి ఉఛ్ఛ్వాస నిశ్వాసాల్ని నియంత్రిస్తుంది. అపాన వాయువుకు స్థానం గుదప్రదేశం.  ఇది శరీరం నుండి మలినాల్ని తొలగిస్తుంది. వ్యాన వాయువు అనేది శరీరం అంతా వ్యాపించి ఉండి రకరకాల ప్రకోపాలకు కారణం అవుతూ‌ ఉంటుంది. ఉదాన వాయువుకు స్థానం నాభిప్రదేశం. ఇది శరీరం యొక్క అవయవాల్లో‌ స్పందన కలిగిస్తుంది.  సమాన వాయువు శరీరంలో‌ కంఠప్రదేశాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది.  ఇది చేసే‌ పనులు నాడీమండలాన్ని నియంత్రించటం,  అన్నసారాన్ని సర్వాంగాలకూ సమనంగా అవసరమైన విధంగా పంచటం. 

ఈ వాయువులు అన్నింటికీ అధిపతి ప్రాణవాయువు. దీని నియంత్రణలోనే జీవుడి ఉపాధి యొక్క ఆయుర్దాయం కూడా ఆధారపడి ఉంటుంది.  ఒక అభిప్రాయం ప్రకారం, ఈ ఉపాధికి ఇన్ని శ్వాసక్రియలు అని ఉపాధి యేర్పడినప్పుడే నిశ్చయం ఐపోతుంది. శ్వాస వేగం పెరిగితే, ఆ ఉపాధి భూమి మీద నిలబడి ఉండే కాలం తగ్గుతుంది. అలాగే శ్వాస ఎంత తక్కువ వేగంతో‌ జరిగితే ఆ ఉపాధి అంత హెచ్చు కాలం భూమి మీద ఉంటుంది. అందుకే చాలా నిదానంగా శ్వాసించే‌ తాబేలు వందల యేళ్ళు బ్రతుకుతుంది అని అంటారు. ప్రాణాయామంతో యోగులు శ్వాస మీద నియంత్రణ సాధిస్తారు.అందుకే వారు తమ ఇఛ్ఛానుసారం దీర్ఘకాలం జీవించ గలరని అంటారు.

సాధారణ పరిస్థితుల్లో మనకు మన శ్వాసమీద నియంత్రణ ఉండదు.  ఆ కార్యక్రమం మన ప్రమేయం‌ ఏమాత్రం కూడా జరిగిపోతూ‌ ఉంటుంది. ఐతే కావాలంటే మన శ్వాసను కొంతలో కొంత అదుపు చేసుకోగలం అన్నది అందరికీ తెలుసు. యోగసాధకులు ప్రాణాయామం అనే‌ ప్రక్రియతో దానిని బాగా అదుపు చేయగలరు.  సిథ్థి లభించిన యోగులు శ్వాసను నిలిపివేసి కూడా నిరపాయంగా ఉండగలరు.  ఇది చదివి ఎవ్వరూ ప్రయోగాలు చేయకండి.  ఈ ప్రాణాయామం అనేది కేవలం గురువు వద్ద శ్రధ్ధగా నేర్చుకోవలసిందే‌ కాని పుస్తకాలు చదివీ ఉపన్యాసాలు వినీ అభ్యాసం చేయటం మహా ప్రమాదకరం.  యుక్తేశ్వరగిరిగారు శ్వాసను పూర్తిగా నిలిపివేసే వారని వారి శిష్యుడు యోగానందగారు వ్రాసారు.  శ్వాసమీద నియంత్రణతో ప్రాణవాయువు సంచారం మీద ఆధిపత్యం లభిస్తే దానితో అనుసంధానమై ఉన్న మిగతా నాలుగు వాయువులూ కూడా స్వాధీనం అవుతాయి. 

ఇలా వాయువులని నియంత్రణ లోనికి తెచ్చుకున్న వాడికి సంసారంతో సాంగత్యం పోవటమూ, ఇంద్రియాలు అదుపులోనికి రావటమూ‌ ఎలా జరుగుతుందీ అన్నది చూద్దాం.  కోపావేశం వచ్చినప్పుడు మనకి శ్వాసవేగం పెరుగుతుందని అందరికీ తెలుసు కదా.  అలాగే కోపావేశం అనేది కలిగినప్పుడు మనస్సు అదుపు తప్పుతుందనీ కూడా మనందరకీ కూడా తెలుసు.  అలా కోపం కారణంగా అదుపు తప్పిన మనస్సుతో మనం ఎలాంటి అనవసరమైన, ప్రమాదకరమైన, అమర్యాదకరమైన మాటలు మాట్లాడేస్తామో కూడా తెలుసు కదా.  అలాంటి స్థితిలో ఎవ్వరి మీదకైనా చేయీ కాలూ‌ లేస్తాయి కూడా అప్పుడప్పుడు. అంటే కోపంతో మనం మన వాక్కు మొదలైన జ్ఞానేంద్రియాల మీదా, కరచరణాది కర్మేంద్రియాల మీదా అదుపు కోల్పోతున్నాం అన్నమాట.  కోపంతో శ్వాసవేగం పెరుగుతున్న కొద్దీ మనమీద మనం ఇలా అదుపు కోల్పోవటమూ హెచ్చుతుంది. ఇంకొక విషయం చూద్దాం.  ఎవ్వరైన ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు వారి శ్వాస నిదానంగా హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది.  ఈ గమనికలను కొద్దిగా విలోమ క్రమంలో పెట్టి ఆలోచిద్దాం.  శ్వాసను ప్రయత్నపూర్వకంగా నియంత్రిస్తే ఏమి జరుగుతుందీ? మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం కూడా సాధ్యపడుతుంది. అప్పుడు ఇంద్రియాలు కూడా వాటికి అధిపతి ఐన మనస్సు ప్రశాంతంగా ఉంటున్న కారణంగా నిరుద్వేగంగా ఉండటానికి అలవాటు పడతాయి. బయటి ఉద్వేగాల కారణంగా కోపాదికాలు చెలరేగి శ్వాసను నియంత్రణ తప్పించటం కాక విలోమంగా శ్వాస మీద నియంత్రణ చిక్కటం వలన కోపాదికాలు అణచబడి, బయటి ఉద్వేగకారకాలతో మనస్సు సంయోగం చెందటం మానేస్తుంది.  అంటే, ఎవరన్నా పిచ్చివాడని గేలి చేసినా కోపం‌ రాదన్న మాట.  ఇంద్రియాలు కూడా మనస్సునుండి ప్రతిస్పందన లేక పోవటం వల్ల అదుపులో ఉంటాయి.  అలా క్రమశిక్షణ నేర్చుకున్న ఇంద్రియాలు క్రమంగా ఉద్వేగ కారకాల్ని మనస్సుకు చేరవేయటమూ మాని వేస్తాయి.  మనస్సు పట్టించుకోదని ఇంద్రియాలు ఊరకుంటాయీ అన్న మాట.  ఇదంతా చెప్పినంత తేలిక కాదు.  కాని అభ్యాసం చేసినకొద్దీ ఈ దిశలో ఫలితం ఉంటుంది.

ఇలా,  క్రమంగా మనస్సు బహిఃప్రపంచంతో  సాంగత్యాన్ని విడిచి పెడుతుంది.  ఈ స్థితిని అభ్యాసం చేస్తూ ఉన్న మనిషి, మనస్సుని శ్రీహరి మీద నిలపాలి.  మనస్సుకి ఏదో ఒక ఆలంబన అవసరం.  అది ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోలేదు.  అందుకని అది మళ్ళీ గాడి తప్పే ప్రమాదం రాకుండా ఉండటం కోసం మంగళప్రదం ఐన శ్రీహరి మూర్తిమీద నిలపమని చెబుతున్నారు శుకయోగి.  మరి మనకు ఆ శ్రీహరి ఇలా ఉంటాడూ అని తెలియాలి కదా మనస్సును లగ్నం చేయటానికి?  

ఇలా శ్రీహరి మంగళ విగ్రహం మీదనే ఎందుకు దృష్టి నిలపాలీ?  మనం ప్రాపంచిక విషయాల మీద ధారణ అంటే దృష్టిని నిలపటం చేస్తూ ఉంటే మనస్సు ఆ ప్రాపంచిక విషయాలనే పట్టుకుంటుంది.  ప్రాపంచిక విషయాలు దుఃఖ కారణాలు అని తెలుసు కాబట్టి అలా మనం ప్రాపంచిక విషయాల మీద ధారణ చేయటం దండగ.  ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన అంటుకున్నట్లుగా ప్రాపంచిక విషయాల్ని మనస్సులో మనం మూట కడితే వాటి తాలూకు వాసనలు మనస్సుకు అంటుకుంటాయి. ఈ వాసనలని పట్టుకుని కూర్చున్న మనస్సు గల  శరీరం పడిపోయాక, ఆ మనస్సు గల జీవుడు ఆ వాసనలతో ప్రయాణం చేసి వాటికి అనుకూలంగా ఉండే మరో‌ దేహం వెతుక్కుని ఆశ్రయిస్తాడు.  అంటే దుఃఖం కొనసాగటమే పర్యవసానం.  మనం  ప్రాపంచిక విషయాల్ని కాక శ్రీహరిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందీ?  నిప్పును ఆశ్రయించిన బట్టకు ఏం‌జరుగుతుందో అదే!  ఆ బట్టని అంటుకుని ఉన్న మంచీ చెడూ అన్ని వాసనలతోటీ‌ అది దగ్ధం ఐపోతుందా లేదా?  అలాగే శ్రీహరిని ఆశ్రయించిన మనస్సుకూ అన్ని వాసనలూ నశిస్తాయి!  ఆ మనస్సు కూడా నశించి బుధ్దిలోకి వెళ్ళి మాయం అవుతుంది.

సరే,  శ్రీహరిని ఆశ్రయించటం అవసరం అని తెలిసింది.  ఇక ఆయన స్వరూపం తెలిసే విధానం చూడాలి.  దీనికి ఒక ఉపాయం చెబుతున్నాడు శుకయోగి. ఈ విశ్వంలోనే విష్ణువు యొక్క దివ్యస్వరూపాన్ని ఆరోపించుకుని అభ్యాసం చేయవలసిందీ అని. వాయువులని నిరోధించి, సంకల్పవికల్పాల స్వరూపమైన మనస్సుని స్వాధీనం చేసుకుని ఉన్న యోగికి అహంకారం నాశనదశలో ఉంటుంది.  కాబట్టి, విశ్వం అంతా శ్రీహరియొక్క సాకారమైన స్వరూపంగా భావన చేయటానికి చాలా అనువుగా ఉంటుంది.  అంతే కాదు, ఈ‌ విశ్వాకార విష్ణుస్వరూపంలో తాను కూడా ఒక భాగమే నన్న అవగాహనా కలుగుతుంది.

ఐతే  ఒక్క విషయం మాత్రం మరవకూడదు.  ఈ విశ్వం అంతా తానే అయిన స్వరూపంగా మనం దర్శించే హరిస్వరూపం ఆయన యదార్థ స్వరూపంలో ఒకానొక అంశ మాత్రమే!  ఆయన ఈ కనిపించే విశ్వం కన్నా అధికుడూ దానికి అతీతుడూ కూడా. 

భగవంతుడైన శ్రీహరి నుండి ఆయన లీల వలన కాలస్వరూపంగా ఈ విశ్వం ఆవిర్భవించింది.  అది ఒక అండంగా ఉంది అనుకుంటే దానికి భూమి, జలమూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూ అనే ఐదు మహాభూతాలూ, వాటి పైన అహంకారమూ మహత్తూ అనే రెండు అధిభూతాలతో మొత్తం ఏడు ఆవరణలు కలిగి పొరలుపొరలుగా రేకులు ముడుచుకుని ఉన్న ఒక మొగ్గలాగా ఉంటుంది. మనం భూమి మీద ఉండి భావన చేస్తున్నాం కాబట్టి ఈ‌ క్రమంలో వాటిని గ్రహించాలి. ఈ మహాండము యొక్క పొరలని ఆశ్రయించుకొని ఉంటాడు జీవుడు.  వీటిలో లీలగా ప్రవేశించీ, నిజానికి వీటిని పూర్తిగా అధిగమించీ ఉంటాడు భగవంతుడు.  ఇలా బ్రహ్మాండ రూపంలో ఉన్న దేవుణ్ణి భావించటమే‌ ధారణ అని చెప్పబడుతుంది.

అని చెప్పి శుకయోగి ఆ తరువాత, విరాట్ విగ్రహాన్ని వర్ణించి చెబుతున్నాడు.

29, ఆగస్టు 2013, గురువారం

ద్వితీయస్కంధం: 03. సంసారం నుండి తొలగిపోతే మార్గం

ఆ పరీక్షిన్మహారాజుకి శుకయోగి మాటలు అమితానందం కలిగించాయని వేరే చెప్పాలా?

ఆ శుకయోగీంద్రుడు ఇంకా ఇలా అన్నాడు

ఓ‌ మహారాజా!  నువ్వెందు కయ్యా బెంగ పడతావూ?  నీ కైతే మరొక ఏడు రోజులకి కాని జీవితానికి ముగింపు రాదు కదా?  అందుచేత, నీ చేతిలో బోలెడు సమయం ఉంది.  ఆ మృత్యుఘడియలు మీదకు వచ్చేలోగా నువ్వు పరలోకాన్ని సాధించటం కోసం‌ ప్రయత్నించ వచ్చును.  ఆ సాథనా ప్రయోజనంగా పరమశుభాన్ని సంపాదించుకోనూ వచ్చును.

పరమశుభం అనే మాట వేదాంత సాహిత్యంలో అప్పుడప్పుడు దర్శనం ఇస్తూ ఉంటుంది.  ఒక్కొక్క సారి శుభం అనే వాడతారు కూడా.  దీని అర్థం మోక్షం అనే.  మోక్షభూమికలు అని ఏడింటిని చెబుతారు.  వాటిలో మొదటిదాని పేరు శుభేఛ్ఛ.  దాని అర్థం శుభం (మోక్షం) పొందాలీ అన్న కోరిక.

చివరి రోజులు దగ్గర పడినప్పుడు దేహ ధారణం చేసి ఉన్న జీవుడు ఏమీ కంగారు పడకూడదు.  తన దేహమూ, తన భార్యాపుత్రులూ, తన బంధుమిత్రులూ అంటూ తనని అంటి పెట్టుకుని ఉన్న ఈ‌ బంధాలన్నింటి మీదా మోహం వదిలి పెట్టెయ్యాలి. ఇంక నా కేమీ కోరికలు వద్దూ అని మనస్సుని చక్కగా ధృఢంగా ఉంచుకోవాలి.  అలా అయితేనే అన్ని  మోహాలూ వదిలి పెట్టటం కుదురుతుంది సుమా.  

నిష్కామం,  అంటే కోరికలు లేకపోవటం అనేది యోగసాథన తగినంత పండితే కాని నిజంగా కుదరదు.  కాని ఇంక ఏ కోరికలూ వద్దూ అని ధృఢంగా అనుకోవటం అంటూ మొదట జరగాలి కదా?

ఇంకా ఇంటి మీద వ్యామోహం ఏమిటి.  అది వదిలేసాడు కదా?  అందు చేత పుణ్యక్షేత్రాలు దర్శించుకుందుకు బయలు దేరాలి.   పుణ్యనదుల్లో స్నానాలు చేయాలి. 

పోతనగారు అంతకాలంబు డగ్గరినన్ అన్నారు.  మనం దానిని వ్యావహారికంలో చివరి రోజులు దగ్గర పడ్డప్పుడు అన్నాం.  ఇక్కడ చివరి రోజులు దగ్గర పడినప్పుడు అన్నదాని గురించి ముందు మరి కొంచెం‌ ఆలోచిద్దాం. ఇప్పుడు  శుకయోగి పుణ్యతీర్థాలు సేవించుకో పో, అంటున్నారు.  

వయస్సు ఉడిగి, జవసత్వాలు కొడిగడుతున్న శరీరంతో పుణ్యక్షేత్రాలకు పోవటం ఎలా సాధ్య పడుతుందీ?  పడదు కదా?  అంటే లోతైన అర్థం వేరే ఉండాలి. ఈ రోజుల్లో అయితే సరాసరి పుణ్యక్షేత్రానికి విమానంలో వెళ్ళి, ప్రముఖుడి హోదాతోనో, అలాంటి వారి సిఫార్సుతోనో త్వరగా దర్శనం చేసేసుకోవచ్చును.  పూర్వం విమానాలు కాదు గదా, కనీసం మంచి నడకదార్లూ తక్కువగానే ఉండేవి అనేక క్షేత్రాలకు.  కాశీకి పోయినవాడూ, కాటికి పోయినవాడు ఒకటే లాంటి సామెతలు అందుకే‌ పుట్టాయి.  అలాంటి దీర్ఘప్రయాసల కోర్చి వృధ్ధాప్యంలో ఎవరూ పుణ్యక్షేత్రాలను దర్శించటానికి పోలేరన్నది నిర్వివాదం. 

మనిషి జీవితంలో గృహస్థుగా బాధ్యతల నిర్వహణ అనేది ధర్మయుక్తంగా నిర్వహించి తీరవలసిన కర్తవ్యం.  నడివయస్సు ఒక స్థితికి వచ్చేసరికే, పిల్లలకు అందించవలసిన వర్ణాశ్రమ సంబధమైన సంస్కారాలూ,  చేయవలసిన కన్యాదానాలూ, కుటుంబం సజావుగా సాగటానికి కావలసిన ధనసంపాదనా అన్నీ పూర్తి చేసుకోవచ్చును.  ఆపైన పెద్దవారు చేసేది అనవసరమైన బాదరబందీ లన్నీ నెత్తిన వేసుకుని అందరి మీద పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉండటమే! ఇక లౌకికంగా చేయవలసిన కార్యక్రమాలు లేవని ఒక పట్టాన మనస్సు అంగీకరించదు. నిజానికి మనిషికి ఇవే చివరి రోజులు. ఒకటయ్యేది, పదివేలయ్యేది ఈ రోజుల్లో భగవచ్చింతన మొదలు పెట్టాలి కనీసం. ఈ‌ రోజులు  మరీ ముదరబెట్టెస్తే, మరి ఇల్లు దాటే పరిస్థితి ఉండటం కష్టమే!

పుణ్యక్షేత్రాలు దర్శించటం అనేది మనశ్శుధ్ధికి సాధనం.  అన్నీ వదిలేసాం అనుకోవటం తేలికే!  కాని ఇల్లు దాటి నాలుగు రోజులు గడిపితే కాని నిజంగా ఎంత వరకూ బంధాలకు దూరం కాగలుగుతున్నామో తెలియదు కదా? 

ఇక పోతే, మహాభారతంలో ఒక సందర్భంలో భీష్మాచార్యుడికి పులస్త్యబ్రహ్మ దర్శనం ఇచ్చారు. తమ దర్శనం వృధాపోరాదు కాబట్టి ఏదైనా కోరుకోమంటే, భీష్ముడు అయ్యా, నాకు పుణ్యక్షేత్రాలూ నదుల గురించీ,  వాటి ప్రభావాల గురించీ‌ విపులంగా చెప్పవలసిందీ అని అడిగారు. పులస్త్యబ్రహ్మ అనేక విషయాలు చెప్పారు. పుణ్యక్షేత్రాలూ నదులూ అనేవి అనేక మంది ముక్తసంగుల యొక్క పాదస్పర్శచేత, స్నానంచేత పవిత్రం అయినవి.  వారి దివ్యప్రభావాన్ని పొదుగుకుని ఉంటాయి నిత్యం.  అక్కడకు మనబోటి వారు పోయి భక్తిశ్రధ్ధలతో సేవిస్తే, మనకు ఆ మహానుభావుల యొక్క దివ్యవిభూతి వలన కొద్దో గొప్పో సత్ప్రభావం కలుగుతుంది.  అంటే, మన మనస్సులు ఆ ప్రభావాల వలన పవిత్రం అవుతాయి.  దాని పర్యవసానంగా మనకు ప్రాపంచిక కశ్మలాలను సుఖాలుగా భావించే పామరత్వం నుంచి కొంచెమైన మార్పు కలిగి మోక్షసాధన పట్ల ఆసక్తీ భక్తీ కలుగుతాయి.

ఒంటరిగా శుచియైన ప్రదేశం చూసుకుని శాస్త్రోక్తంగా కృష్ణాజినమో, దర్భాసనమో, శుభ్రవస్త్రమో పరుచుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. 

సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు. సాధనాక్రమం, దానికి ఉపకరణాలుగా ఉండే సాధనసంపత్తీ అంతా కూడా ఉదాత్తంగా ఉండాలి.  మురికి గిన్నెలూ తెడ్లూ వాడుతూ, తినటాకికి పనికివచ్చే  వంట చేయలేం కదా?  అవధూతల స్థాయి మహానుభావులతో పోలికలు తెచ్చుకోకండి.  ఎంతకాలం 'నేను' అనే‌ భావనతో ఈ‌ లోకంలో  తిరుగుతూ‌ ఉంటామో అంతకాలమూ సాధకులమే.  ఈ‌ ప్రకృతి యొక్క మాయకు లోబడ్డ వాళ్ళమే!  ఆహారమే అవసరం లేని అవధూతకు గిన్నెలూ‌ అక్కరలేదు వంటా అక్కర లేదు.  అది వేరే‌ స్థితి.

ఇలా కూర్చుని ప్రణవాన్ని ధ్యానం చేసుకోవాలి.  దాన్ని బ్రహ్మబీజం అంటారు.  అది ముల్లోకాల్నీ‌ పవిత్రం చేసే‌ పరమమంత్రం. 

ప్రణవం అంటే ఓం‌కారం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని చెబుతారు. ఓం‌కారం పరబ్రహ్మానికి ఒక సంకేతంగా చెప్పుకుంటాం. గీతాశాస్త్రం కూడా ఇదే చెబుతోంది.  ఈ‌ ఓం‌కారంలో అ-ఉ-మ అనే మూడు బీజాలు సంపుటిగా ఉన్నాయి.  ‌ఓం‌కారం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.

ఈ‌ ధ్యానంతో ఐదు ప్రాణవాయువులనీ జయించి అదుపులోకి తెచ్చుకోవాలి. 

ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని ఐదు రకాలు ప్రాణవాయువులు.  ఇవి శరీరాన్ని ఆశ్రయించుకుని వివిధక్రియలు చేస్తూ ఉంటాయి. వీటిని అదుపుచేసే ప్రక్రియకే‌ ప్రాణాయామం అని పేరు.

ఈ‌ ఇంద్రియాలు నిత్యమూ ప్రాపంచిక విషయాల వెంట పంచకల్యాణి గుర్రాల్లాగా పరుగులు పెడుతూనే ఉంటాయి.  అలా పరుగులు తీసింది చాలు అనుకోవాలి.  వాటి పరుగులు ఆపేందుకు గాను, మనస్సుని పగ్గంగానే,  బుధ్ధిని సారథిగానూ నియమించాలి.

ఇక్కడ దేహం అనేది ఒక రథంగా భావించి చెబుతున్నారు. ఈ రథానికి రథికుడు - అంటే అందులో దర్జాగా ప్రయాణం చేసేవాడు - జీవుడు.  ఈ జీవుడికి,  దేహం అనే రథాన్ని నడపటానికి గాను ఉన్న సారథి పేరు బుధ్ది.  ఆ బుధ్ధి అనే సారథి చేతులో ఉన్న పగ్గం పేరు మనస్సు.  ఈ‌ మనస్సు అనే పగ్గానికి కట్టబడి ఉండి, దేహరథాన్ని పరుగులు పెట్టించే గుర్రాలే  పంచేంద్రియాలు అనేవి.   సారథి ఐన బుధ్ది నిర్లక్ష్యంగా ఉండి,  మనస్సు అనే పగ్గాన్ని సరిగ్గా పట్టుకోక పోతే, దేహం అనే బండిని లాగే ఇంద్రియాలు అనే గుర్రాలు, వాటి చిత్తం వచ్చినట్లు పరుగులు తీస్తూ పోతాయి.  పాపం, ఆ దేహరథంలో ఉన్న జీవుడికి ఈ ప్రయాణం కావలసిన గమ్యానికి చేర్చేది కాకుండా పోతుంది.   

లౌకికమైన రకరకాల కర్మల వైపుకి ఈ‌ మనస్సు జీవుణ్ణి గుంజుతూనే ఉంటుంది.  వాటి వైపుకి ఇంక మనస్సు పోకుండా బుధ్ధిని ఉపయోగించాలి.

ప్రకృతిలో ఉన్నంతకాలమూ నేనూ నాది అన్న భావనలు ఉంటాయి కదా? ఈ‌ భావనలకు అనుగుణంగా జీవుడు దేహయాత్ర చేస్తున్నంత కాలమూ,  వాడు చేస్తున్న ప్రతి పనికీ లక్ష్యం ఈ నేనూ - నాది అన్న ( అహంకార, మమకార ) భావనలని తృప్తి పరచటమే అవుతోంది. అలా చేసే ప్రతిపనీ (అంటే ప్రతి కర్మా) ఆ జీవుడికి మంచో చెడో‌ ఫలితాన్ని కట్టబెడుతుంది.  ఇష్టమున్నా లేకపోయినా ఆయా ఫలితాలను అనుభవించటం తప్పదు జీవుడికి.  బుధ్ది తిన్నగా బండిని నడిపిస్తే, ఇంద్రియాలు అనే‌ గుర్రాలు మాటవిని, సరైన పధ్ధతిలో నడుస్తాయి.  సరైన పధ్ధతి అంటే మనస్సనే కళ్ళెం తిన్నగా పట్టుకుని బుధ్ది అనే సారథి, దేహరధాన్ని పరమపదం వైపుకు పోనివ్వటమే.  ఈ ఇంద్రియాలనే గుర్రాలు వాటికి తోచినట్లు పరుగులు పెట్టనివ్వక పోవటమే.

అయితే, బుధ్ధిచేత మనస్సుని నిగ్రహించాలంటే ఆ బుధ్ధికి ఏదో ఒక ఊతం కావాలి.  భగవంతుడి సాకారస్వరూపాన్నే బుధ్ధికి ఆలంబనం చేస్తే పని తేలికౌతుంది.

మనస్సు అనేది సహజంగా, చంచలమైనది.  అందుచేత అర్జునుడు చంచలం హి మనః కృష్ణ! అంటే స్వామి దాన్ని అదుపు చేయాలంటే రెండు పధ్ధతులు కనిపిస్తున్నాయి. ఒకటి, అభ్యాసం, రెండు వైరాగ్యం అన్నాడు.  జన్మతః వైరాగ్యం సిథ్థించటం పూర్వజన్మ వాసనవల్ల తప్ప సాథ్యం కాదు.  ధృవుడికి కలిగింది అలాంటిదే.  ఇంక సామాన్య సాధకులకి దారి మనస్సుని కట్టుబాటులో ఉంచటాన్ని అభ్యాసం చేయటం ఒక్కటే.  

మనస్సుకి పట్టుకునే తత్త్వం ఒకటి సహజంగా ఉంటుంది. ఓపిక పట్టి, రామా రామా అని గంటల తరబడి జపం చేసి చూడండి.  ఇంక చాలు అని మీరు లేచిపోయినా, లేక నిద్రపోయి లేచినా మనస్సు మాత్రం రామా రామా అంటూనే ఉంటుంది.  అదీ దాని తత్త్వం అన్నమాట.  కొందరికి ఇది అనుభవంలో ఉండవచ్చును.  లేని వారు ప్రయత్నించి ఈ మాటలో సత్యం తెలుసుకో వచ్చును.

అంటే మనం రామా రామా అన్న జపాన్ని ఆలంబనం చేస్తే మనస్సు కాస్తా దాన్ని పట్టుకుని ఒక పట్టాన వదలటం లేదు.  బుధ్ధికి ఒక ఉపాయం దొరికినట్లేగా?  అది మనస్సుకి భగవంతుడు అనే ఒక తత్త్వం యొక్క ఆకారం, గుణాలూ, లీలావిశేషాల వర్ణనలూ ఇలా భగవత్సంబధమైన ఊతం ఒకటి అప్పగిస్తే, మనస్సు ఇక దాన్ని ఒక పట్టాన వదలదు.  క్రమంగా, అది ఊతం వదిలేసి జారుకుంటూ ఉంటే?  ఫరవాలేదు, బుధ్ధికి ఇప్పుడు మనస్సుని కట్టెయ్యాలీ అంటే ఏమి చేయాలో తెలిసిపోయింది కదా?

మనస్సుకు తనకు దొరికింది, ఎటువంటి ఆలంబనం అనే విచక్షణ ఏమీ ఉండదు. విచక్షణ ఉండేది బుధ్ధికి.  అందుచేత బుధ్ధిని సారధి, మనస్సుని దానిచేతిలో కళ్ళెం అన్నాం.  ఒకడి బుధ్ధి, భగవద్విషయాలు ఊతమిస్తే మనస్సు వాటిని పట్టుకుంటుంది.  మరొకడి బుధ్ధి, డబ్బు వ్యామోహమో లేదా స్త్రీవ్యామోహమో అనే  ఊతం ఇస్తే,  వాడి మనస్సు దాన్నే పట్టుకుంటుంది.  అందు చేత సాథకులు భగవంతుడికి సంబంధించిన విషయాలు పట్టుకునేనా మనస్సు చేత అభ్యాసం చేయించాలి. 

ఇలా చక్కగా పధ్ధతిగా ధ్యానం కొనసాగిస్తే మేలు జరుగుతుంది.  లోకాన్ని నిత్యం త్రిగుణాలు కదా మనకి ఎఱుక పరచేదీ?  ఇంక విషయాల నుండి మనస్సు విరమించు కుంది కాబట్టి, ఈ త్రిగుణాల వల్ల కలిగే వికారాలు ఏవీ మనస్సుకు సోకనే సోకవు.

సత్వమూ, రజస్సూ, తమస్సు అనే మూడు గుణాలనీ త్రిగుణాలు అని కలేసి చెప్తారు.  సత్వం అనేది ప్రశాంత స్థితి అనుకోండి.  రజస్సు వలన నేను ఇది చెయ్యాలీ, అది చెయ్యాలీ,  నాకు ఇది కావాలీ, అది కావాలీ అనే కోరికలు ఏర్పడుతాయి,  క్రియాకలాపం చేయించే స్థితి రాజసికం అన్నమాట.  తమస్సు అంటే అహంకారం, సోమరితనం, సుఖలాలస, హింసాప్రవృత్తి వంటి దుర్గుణాల తత్త్వం అన్నమాట.  ఈ‌ త్రిగుణాలు మన నిత్య జీవితంలో ప్రతి వస్తువులోనూ, ప్రతిభావన లోనూ‌ దర్శిస్తూనే ఉంటాం. అసలు మనం ప్రపంచాన్ని ఈ‌ త్రిగుణాలనే‌ రంగుల్లో తప్ప వేరుగా చూడనే చూడలేం‌ అన్న మాట.  మనం‌ ఏది పొందుతున్నా, దేన్ని భావిస్తున్నా దానికి కారణం త్రిగుణాలే కాని అన్యం కావు. 

ఇలా ధారణ చేసిన వాడికి త్రిగుణాల మురికి వదిలిపోయి మనస్సు నిర్మలం అవుతుంది.  నిర్మలచిత్తం సాధించిన వాడు హాయిగా విష్ణుపదం చేరుకుంటాడు.

మనస్సు ప్రాపంచిక విషయాలలో పడి తిరుగుతున్నంత కాలం ఈ త్రిగుణాలు దానికి క్షణక్షణం రకరకాల దృశ్యాల్ని చూపిస్తూనే,  ఆకర్షిస్తూనే ఉంటాయి.  రకరకాల అనుభవాల్ని ఈ‌ త్రిగుణాలు అందిస్తూ,  అవి మనస్సును తమ పెంపుడు కుక్కలాగా తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉంటాయి.

కాని మనస్సు భగవంతుడికి సంబంధించిన వస్తు, విషయ భావనలను పట్టుకుని కూర్చుం దనుకోండి?  అప్పుడు ఆ మనస్సుకి తదితరం అయిన పబయటి ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతుంది.  అభ్యాసం ధృఢం ఐతే అటువంటి ఆసక్తి చచ్చిపోతుంది కూడా.

ప్రపంచం అంటే ప్రకృతికి, దూరం ఐపోయిన వాడి పరిస్థితి ఏమిటి?  వాడి మనస్సు మూడు గుణాల తాలూకూ మురికినీ వదిలించుకుంది కదా? మురికి వదిలిన అద్దంలో బొమ్మ స్పష్టంగా ఉంటుంది కదా?  ఇప్పుడు ఆ మనస్సు తాను బాగా అభ్యాసం చేసి అనుసంధానం చేసుకున్న భగవత్తత్త్వం మాత్రమే తెలిసి ఉంటుంది.  కాబట్టి అది ఆ భగవత్తత్త్వం లోనే లీనం ఐపోతుంది.  అలా మనోలయం ఐపోవటమే విష్ణుపదం చేరుకోవటం.  విష్ణువు అంటే సృష్టికి ముందే ఉన్న యదార్థ తత్త్వం. సృష్టినుండి విడివడిన తరువాత మనోలయం ఐపోయిన జీవుడు తానే ఆ యదార్థతత్త్వంగా మిగిలిపోతాడు.  అదే కైవల్యం, అంటే మోక్షం. 

ధారణ అనేది బాగా కుదురు కున్నాక ఈ ప్రకృతి మాయ వలన కలిగిన 'నేను' అనే భావన పోయి, కేవలం జీవుడిగా 'నేను' అనేది మాత్రం బీజరూపంగా మిగులుతుంది .  ఈ స్థితిలో వాడు పరమసుఖ స్వరూపమైన సర్వాంతర్యామి యొక్క సత్తా మాత్రం విషయంగా అనందిస్తూ ఉంటాడు.  ఈ స్థితికి చేరుకున్న వాడినే యోగి అంటాం.

మోక్షం సాధించే విధానాన్ని మరింత విపులీకరిస్తున్నారు. మనస్సు లయం ఐపోయినప్పుడు తొలుత ప్రకృతినుండి విడిగా ఐపోతాడు.  కాని జీవుడిగా మిగిలే ఉంటాడు.  ఈ‌ స్థితిలో వాడికి ప్రపంచంతో‌ ఏవిధమైన సాంగత్యం ఉండదు.  వాడు కేవలం భగవత్తత్త్వంతో మాత్రం సంబంధం కలిగి ఉంటాడు. ప్రకృతిలో సాంగత్యంతో ఉండటమే దుఃఖం. భగవత్తత్త్వంతో సాంగత్యం పరమసుఖం.  ఈ‌ స్థితిలో ఉన్నవాడు యోగి అనిపించుకుంటాడు.  ఈ‌ మాటకు అర్థం భగవంతుడితో కూడి ఉన్నవాడు అని. 

ఈ సర్వాంతర్యామి పట్ల భక్తి భావన సుధృఢమై నిలవాలి.  క్రమంగా బీజ రూపమైన 'నేను' అనేది కూడా యోగాగ్నిలో దగ్ధం ఐపోతుంది.  ఇలా దగ్ధబీజ స్థితిని పొందటమే మోక్షం.

ఇలా, క్రమంగా ఇలా యోగం సిథ్థించిన వాడు జీవుడిగా తన ఉనికిని కూడా విసర్జిస్తాడు. వేయించిన విత్తనం మొలకెత్తదు కదా?  అలా బీజస్వరూపంగా ఉన్న 'జీవుణ్ణి' అనే‌ భావనకూడా నశించిపోయాక మిగిలేది కేవలం భగవత్తత్త్వం మాత్రమే.  పూర్తిగా సృష్టి నుంచి బయటికి వచ్చి అనంతమైన విష్ణుతత్త్వంలో లీనం ఐపోయా డన్నమాట. ఇంక జీవుడే లేనప్పుడు పునర్జన్మ అంటూ ఉండదుక?

ఇదంతా చదువుతే శుకయోగి సాధారణ సాధకుడి స్థాయి నుంచి, ఒక వ్యక్తి కైవల్యం సాధించే దాకా చెప్పారని తెలుస్తోంది.  నిజానికి, ఎవరికైన ఇదంతా ఒక జన్మలో పూర్తిచేయటం సాధ్యమా అన్న సంశయం తప్పకుండా వస్తుంది.  నిజమే, దానికి ఏళ్ళూ పూళ్ళే‌ కాదు, జన్మలకు జన్మలే పట్ట వచ్చును.  కాని భయం లేదు. ఒక జన్మలో పూర్తి కాగలిగినంత యోగసాధన పూర్తి అవుతుంది.  వచ్చే జన్మలో అది కొనసాగుతుంది.  ఈ‌ మాట భగవద్గీతల్లో శ్రీకృష్ణపరమాత్మ నిష్కర్ష చేసాడు.  ఇది గుర్తు పెట్టుకోవలసిన విషయం.

ఇంకో విషయం గ్రహించ వలసి ఉంది.  చివరి రోజులు దగ్గరకు రాగానే, సాధన ప్రారంభించటం అనేది సాధారణ గృహస్థులకి చేసి ఉపదేశం.  సాధనాక్రమంలో కొన్ని మెట్లు దాటిన వారు, తమతో పాటుగా ప్రస్తుత జన్మకు ఆ సాధన కూడా వెంట తెచ్చుకుంటారు.  కాబట్టి వాళ్ళు చివరిరోజుల దాకా వేచి ఉండాలన్న నియమం ఏమీ ఉండదు.  అందుకు అనుగుణంగా ఉండే ఇంటిలోనే వారు జన్మిస్తారనీ శ్రీకృష్ణులవారి స్పష్టీకరణ గీతలో ఉంది కూడా.


పరీక్షిత్తుకు ఈ‌ సంసారం తొలగిపోయే మార్గం అంటూ శుకయోగి చేసిన బోధ విన్న తరువాత ఒకసందేహం కలిగింది.  భగవత్తత్త్వంలో‌ బాగా ధారణ చేసి త్రిగుణాల మురికిని వదుల్చుకోవాలని చెప్పారు కదా.  అదెలా చేయాలా అన్నది మరింత స్పష్టంగా తెలుసుకోవాలి అనుకున్నాడు.

28, ఆగస్టు 2013, బుధవారం

ద్వితీయస్కంధం: 02. ముక్తి పొందటానికి ఒక్క రెండు ఘడియలు చాలు!

పరీక్షిన్మహారాజా, భగవన్నామం సహాయంతో మనుష్యులు ముక్తి పొందవచ్చు నని చెప్పాను.  మనస్సు భగవంతుని దివ్యప్రభావాన్ని లోన నింపుకుందుకు అయన రూపం నామం, గుణాలూ, ఆయనకు సంబంధించిన కథలూ అన్నీ దోహదం చేస్తాయి.  ఇదంతా భక్తిశ్రధ్ధలకు సంబంధించిన వ్యవహారం.  అవి పుష్కలంగా ఉన్నవాడికి, హరిస్మరణం అనేది ఒకటి రెండు ఘడియలు మాత్రమే చేయటం కుదిరినా,  అది ముక్తిప్రదం అవుతుంది.  విను

తరళం. హరి నెఱుంగక యింటిలో బహు హాయనంబులు మత్తుఁడై
పొరలు చుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవ నేర్చునె వాఁడు సం
సరణముం బెడఁబాయఁ డెన్నఁడు సత్య మా హరినామ సం
స్మరణ మొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృపా

అన్నింటికీ సర్వాధిపతి ఐన శ్రీహరిని తెలుసుకోలేక శరీరం అనబడే ఈ ఇంట్లో ఎన్నో యేళ్ళు ఉంటే మాత్రం ఏం లాభం?  ఈ ఇంద్రియాలు అనబడే బంట్లు అందించే విషయభోగాలు పైకి సుఖాల్లాగా కనిపించి మత్తెక్కిస్తుంటే వాటిలో పడి పొర్లుతూ ఉన్నవాడికి విడుదల ఎక్కడా? ఒక శరీరంతో భోగించి ఇంద్రియతృష్ణ తీరక, ఆ శరీరం కాస్తా పడిపోయాక మరొక శరీరం వెదుక్కుంటూ ఇహలోకం లోనే పరిభ్రమించటం మాత్రమే తెలిసిన వెఱ్ఱివాడు వాడు.  ఇంక వాడికి ముక్తి అనేది ఒకటి ఉంది అనేది తెలుస్తుందా?  తెలిసినా ఇంద్రియాల చెర నుండి బయటపడి దాన్ని తనంత తానుగా అందుకో గలడా?  అసలీ ప్రపంచం అనే పంజరం నుంచి వాడు తప్పించుకోనే లేడేమో! 

కానీ, అలాంటి వాడికైనా, ఎప్పటికో ఒకప్పటికి విరక్తి పుట్టి తీరుతుంది.  అదృష్టవశాత్తు హరిభక్తి కుదిరి, అటువంటి వాడు ఒక్క ముహూర్తకాలం హరినామాన్ని ఆశ్రయించి శ్రీహరిని శరణు కోరినా చాలు.  వాడికి ఆ హరినామం, ముక్తిని ప్రసాదించేది అవుతుంది.  ఇందులో సందేహం ఎంత మాత్రం లేదు.  ఇది సత్యం.

అంతరార్థం స్పష్టమే.  అన్ని ఉపాధుల్లోనూ శ్రీహరి ఉన్నాడు.  అయితే ఆ ఉపాధులకి ఉన్న పరిమితుల కారణంగా హృదయాంతర్వర్తి ఐన శ్రీహరిని తెలుసుకోవటం దాదాపు అసాధ్యం.  దీనికి కారణం నామ రూపాలతో చుట్టూ ఉన్న ప్రకృతిమీద వివిధ ఉపాధుల్లో ఉన్న జీవులకి ఏర్పడే అనుబంధం.  అదే మాయ.  మిగిలిన అన్ని జీవులకంటే,  మానవ ఉపాధిలో ఉన్న జీవుడికి ఒక సౌలభ్యం ఉంది.  అతడు ప్రాపంచిక భోగాలూ, బంధాలు అనే వాటి పట్ల విరక్తి చెంది,  అంతర్ముఖుడై హృదయంలో నెలకొన్న భగవదంశను భావించటం సాధ్యపడుతుంది.  అలా చేయగలిగిన నాడు,  అది ఒక్క క్షణం కాలం చేయగలిగినా ఇక ఈ‌ ప్రపంచానికి కట్టుబడడు.   అదే ముక్తి. అసలు ముక్తి అంటే విడుదల - ఈ‌ ప్రకృతి బంధం నుండి విడుదల.  ఆ అంతర్ముఖత్వం సాధించటానికి శ్రీహరి నామం ఒక్కటే శరణ్యం.  మిగతా వన్నీ ప్రపంచానికి సంబంధించినవి.  కాబట్టి, వాటిలో మనస్సు దేని నాశ్రయించినా అది ప్రపంచాన్ని ఎలా దాటిస్తుందీ? కాబట్టి శ్రీహరి నామాన్ని ఆశ్రయించితే మాత్రమే మోక్షం.

మహారాజా,  ఈ‌ నా మాటలు నమ్మశక్యంగా అనిపించక పోవచ్చు.  ఈ విషయాన్ని పూర్వం  ఖట్వాంగుడు ఋజువు చేసి చూపాడు.   ఆ కథ చెబుతాను విను అన్నాడు శుకయోగి.

సీ.  కౌరవేశ్వర తొల్లి ఖట్వాంగుడఁని విభుం
      డిల నేడు దీవులు నేలు చుండి
శక్రాది దివిజులు సంగ్రామభూముల
      నుగ్రదానవులకు నోడి వచ్చి
తమకు దో డడిగిన  ధరనుండి దివి కేఁగి
      దానవ విభుల నందఱ వధింప
వర మిత్తు మనుచు దేవతలు సంభాషింప
      జీవితకాలంబు సెప్పుఁ డిదియ
ఆ. వరము నాకు నొండు వర మెల్ల ననవుఁడు
నాయు వొక ముహూర్తమంత దడవు
గల దటంచుఁ బలుక గగన యానమున న
మ్మానవేశ్వరుండు మహికి వచ్చి

అనగనగా ఒక రాజు.  ఆయన పేరు ఖట్వాంగుడు.  ఇప్పుడు ఆయన పేరు కూడా ఎవ్వరికీ తెలియక పోవచ్చు.  కాని అప్పట్లో ఆ మహారాజు తన ప్రతాపంతో అందర్నీ జయించాడు.  సప్తద్వీపా వసుంధరా అంటారు.  అలాంటి ఏడు ఖండాలుగా ఉన్న సమస్త భూమండలాన్నీ ఏలిన మహా చక్రవర్తి ఆయన.

దేవతలకూ రాక్షసులకూ గొప్ప యుధ్దాలు జరుగుతూ ఉండేవి.  వాటిలో ఒక సారి దేవతలే ఓడి పోయారు కాలం కలిసిరాక.  అందుచేత దేవతల్లో ముఖ్యుల్ని వెంట బెట్టుకుని  సాక్షాత్తూ ఇంద్రుడే వచ్చి అడిగాడు.  ఓ ఖట్వాంగ చక్రవర్తీ వచ్చి మా తరపున యుధ్ధం చేసి రాక్షసుల్ని ఓడించి పుణ్యం‌ కట్టుకో అని.  

ఆ ఖట్వాంగుడు అంగీకరించి భూలోకం నుండి దేవలోకం వెళ్ళాడు. రాక్షసులతో యుధ్ధం చేసి వాళ్ళని ఓడించాడు. దేవతలకు చాల సంతోషం కలిగింది.  రాజా, ఖట్వాంగా, నీ సహాయం వల్ల గెలిచాం.  నీకు కోరిన వరం ఇస్తాం.  కోరుకో నీకు ఏమి కావాలో అన్నారు దేవతలు.

ఖట్వాంగుడు ఏమి వరం అడిగాడో తెలుసునా?  ఎప్పుడు ఎవరూ,  దేవతలు సహా ఎవరూ, కనీ వినీ‌ ఎరగని వరం అడిగాడు.  దేవతలారా,  నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు.  నాకు ఇంకా ఎంత ఆయుర్దాయం ఉందో దయచేసి చెప్పండి.  ఆ వరం చాలు నాకు.   వేరే వరం ఏమీ అక్కర్లేదు లెండి అన్నాడు.   నిజానికి అదొక పెద్ద వరమా, సాక్షాత్తూ ఇంద్రాది దేవతలనే అడగటానికి.  ఎంత చిన్న కోరికో‌ చూడు ఆయన కోరుకున్నది!

దేవతలు ఆశ్చర్యపోయి.  ఇదేమిటయ్యా ఇంత చిన్న కోరిక కోరావూ తెలిసి తెలిసీ.  సరే, విను, ఇంక నీకు మిగిలి ఉన్న ఆయుర్దాయం అల్లా ఒకే ఒక్క ముహూర్తం మాత్రమే‌ అని చెప్పారు.

ఖట్వాంగుడి ఆయుర్దాయం కాస్తా ముగిసి పోయిందన్న మాట -  మృత్యువు సిథ్థంగా ఉంది, ఒక్క ముహూర్తం తరువాత తనను తీసుకు పోవటానికి.

ఖట్వాంగుడేమీ దిగులు పడలేదు.   వెంటనే,  దేవతల అనుమతి తీసుకుని తక్షణమే ఆకాశమార్గాన భూమికి తిరిగి వచ్చేసాడు.

ఆయనకు భూలోకంలో సమస్తమైన ఐశ్వర్యాలూ ఉన్నాయి.  మహా చక్రవర్తి కదా!  ఆయనకున్న భోగాలు మరి ఎవరి వద్ద ఉంటాయి?  అవన్నీ వదిలి పెట్టేశాడు.  నిత్యం తనను అంటి పెట్టుకు తిరిగే కవుల్నీ, పండితుల్నీ, మంత్రి సామంతుల్నీ అందర్నీ వదిలి పెట్టాడు.  చివరికి తనకు ప్రాణంతో సమానం  అయిన భార్యల పట్ల ఉన్న అనుబంధాన్నీ వదిలి పెట్టాడు.

అత్యంత గాఢమైన వైరాగ్యంతో నిశ్చలమైన చిత్తంతో నిలబడ్డాడు.

క.  గోవింద నామ కీర్తనఁ
గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి
త్రీ విభుఁడు సూర గొనియెను
గైవల్యము దొల్లి రెండు ఘడియలలోనన్

ఈ సంసారసాగరాన్ని దాటించేది కేవలం గోవిందుడు మాత్రమే అనే నమ్మకంతో సుస్థిరమైన చిత్తంతో ఉన్నాడు.  ఈ ప్రకృతి తనని ఎక్కడ వెనక్కు లాక్కుంటుందో అన్న భయం ఏమాత్రం లేకుండా స్థిరంగా గోవిందుడి వల్ల మోక్షం వస్తుందని నమ్మి నిలబడ్డాడు.  ఉన్న కాస్త ఆయుర్దాయమూ, కొంచెం వెలితిగా రెండు ఘడియలే.  (ఘడియ అంటే  24  నిమిషాలు) ఈ స్వల్పకాలం లోనే ఆ ఖట్వాంగ చక్రవర్తి గోవింద నామస్మరణ త్రికరణశుథ్థిగా చేసాడు. ఆ నామ ప్రభావంతో ఆయన మోక్షం సంపాదించుకున్నాడు.

అదండి ఖట్వాంగుడి కథ.  మనకు ఎంతో అబ్బురపాటు కలిగించే ఈ‌ కథలో ఒక ప్రశ్న తోస్తుంది సహజంగా.  దేవతలే గెలవలేని రాక్షసుల్ని ఒక మానవుడు ఎలా గెలవగలడా అని మొదటి ప్రశ్న.  బహుశః అప్పటి రాక్షసరాజుకు దేవతలచేత చావు లేకుండా వరం ఉందేమో.  అదేమీ పెద్ద విచిత్రం కాదు. 

కాని మరొక ముఖ్యమైన అంతరార్థం ఉంది, ఈ‌ ఖట్వాంగుడి కథలో.  అదేమీటో చూడండి.

ఈ‌ శరీరం బ్రహ్మాండానికి ప్రతీక.  దేవతలు ఈ‌ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉంటారు.  మనిషిలోని సర్వేంద్రియాలకూ, మనస్సుకూ వాళ్ళు అధిపతులు.  అలాగే ఈ‌ మానవ దేహాన్ని ఆక్రమించుకుని కామ, క్రోధాది అరిషడ్వర్గమూ ఉంటుంది.   వీటినే రాక్షసులుగా తెలుసుకోవాలి మనం.  జీవుడు ఈ‌ ఇహలోకాన్ని పట్టుకుని నివసిస్తూ ఉన్నంతకాలం,  ఈ‌ ఉపాధిని ఆక్రమించి కూర్చున్న కామం, క్రోధం, మదం లాంటి రాక్షసులు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు.  ఈ ఉపాధిలో నివసిస్తున్న దేవతా శక్తులకి ఊపిరి అడకుండా చేస్తూ ఉంటారు. 

మానవ శరీరం అనే ఉపాధిలో ఉన్న జీవుడు ఉత్తమ గతిని సాధించాలంటే దేవతాశక్తులు గెలిచి, రాక్షసశక్తులు నశించాలి. అలా జరగాలంటే జీవుడు చాలా సాధన చేయాలి.  మూలాధారాది షట్చక్రాలగుండా ఆత్మశక్తిని ఊర్ధముఖంగా ప్రయాణం చేయించాలి.  అదే ఇక్కడి కథలో ఖట్వాంగుడి ఊర్ద్వలోక ప్రయాణం అనే సంకేతంతో చెప్పబడింది.

అలా సాధన పరిపక్వం అయిన జీవుడి ఉత్తమమైన ప్రజ్ఞ అరిషడ్వర్గాది రాక్షసులనీ హతమార్చుతుంది.  ఉపాధిలో ఉన్న దేవతా శక్తులు అన్నీ,  సంతోషంగా సంపూర్ణంగా వికసిస్తాయి.  ఇంక అవి సాధకుడికి కావలసిన శుభం చేకూర్చగలవు.  నిజానికి అసలైన శుభం అంటే మోక్షమే.

సాధకుడు మానవ ఉపాధి అనేది, అత్యల్పమైన జీవిత కాలం కలిగి ఉందని గ్రహిస్తాడు.  అనంతమైన, భగవంతుడి స్వరూపం ఐన కాలప్రవాహంలో ఒక ఉపాధి నిలబడి ఉండే సమయం ఏపాటిది నిజంగా?

ఈ గ్రహింపు రావటమే పూర్ణప్రజ్ఞా స్థితికి చేరుకోవటం.  అప్పుడు ఆ జీవుడు కోరుకునేది ఏమి ఉంటుంది?  ఈ ఉపాధే ఇంక క్షణికమూ స్వల్పమూ అనే దృష్టి కలిగాక, ఇంకా దాన్ని పోషించాలీ అలంకరించాలీ అంటూ‌ ఆలోచిస్తాడా? ఆలోచించనే ఆలోచించడు కదా? 

కొద్దో, గొప్పో ఈ ఉపాధి ఎంతకాలం భరించవలసి ఉందో అంతకాలం భరించటం తప్పదు.  అందుచేత, ఆ కాలాన్ని సర్వేశ్వరుడికి అర్పణం చేసి నిష్కామయోగంలో భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాడు.  

'నేను' అనే భావం విసర్జించి, సమస్తం భగవంతుడే అని గ్రహింపు కలిగాక, కాలం అప్రధానం ఐపోతుంది.  కాబట్టి, అలా ఎంత కాలం భగవంతుణ్ణి స్మరిస్తాడూ అన్నది ప్రధానం కానే‌ కాదు.   అది ఒక మహాయుగం కావచ్చు, ఒక్క క్షణం కావచ్చును.  ముక్తి సిథ్థించటం‌ తథ్యం.

ఇదీ ఈ‌కథలో దాగి ఉన్న అంతరార్థం.

శుకమహర్షి మొట్ట మొదటగా ‌ఈ‌ కథను ఎందుకు చెప్పారో మనకి ఇప్పటికే అవగతం కావాలి.  ఏడు రోజులు చాలా స్వల్పకాలం కదా, ముక్తి సాధించటానికి ఆ కొద్ది సమయం సరిపోతుందా అని కదా పరీక్షిత్తు అనుమానం.  అది నివృత్తి చేయటాని కన్నమాట, ఈ‌ అద్భుత వృత్తాంతం ప్రస్తావించింది ముందుగా. 
 

27, ఆగస్టు 2013, మంగళవారం

ద్వితీయస్కంధం: 01. శుకయోగి భాగవత మహాత్మ్యాన్ని పరీక్షిత్తుకు వివరించటం

జరిగిన కథ:

సూతపౌరాణికుడు నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులకి వ్యాసులవారు రచించిన మహాభాగవత పురాణం చెబుతున్నారు.

హస్తినా పురానికి రాజు పాండవుల మనవడైన పరీక్షిత్తు.  ఆ పరీక్షిన్మహారాజు ఎంతో ధర్మాత్ముడు.  అయినా కాలప్రభావం చేత అడవిలో తపస్సమాథిలో ఉన్న శమీకముని మెడలో చచ్చిన పాముని వేసి అవమానించాడు.  మునికొడుకు శృంగి కోపించి, దుష్టుడైన రాజు తక్షకుడు అనే పాము కరిచి ఏడు రోజుల్లో చనిపోతాడని శపించాడు.  రాజు గంగాతీరంలో ప్రాయోపవేశం చేసి చావుకు సిథ్థపడి ఉంటే అనేక మంది మునులూ,  ఆ తర్వాత వ్యాసులవారి కుమారుడైన శుకయోగీంద్రుడూ ఆ రాజును చూడ వచ్చారు.  నాకు ఈ ఏడు రోజుల్లోనే మోక్షం లబించే దారి ఉందా అని శుకయోగిని రాజు ప్రశ్నించాడు.  

అక్కడితో వెనుకటి ప్రథమస్కంధం సంపన్నం అయింది.  ఇక్కడ నుండి మహాభాగవత పురాణంలో ద్వితీయస్కంధం ప్రారంభం.

---     ---     ---     ---     ---

శుకయోగీంద్రుడికి పరీక్షిత్తు ప్రశ్న సంతోషం కలిగించింది.

సీ. క్షితిప నీ ప్రశ్నంబు శ్రేష్ఠతమం బగు
      నాత్మ విదుల్ మెత్తు రఖిలశుభద
మాకర్ణనీయంబు లయుతసంఖ్యలు గల
     వందు ముఖ్యం బిది యధికతరము
గృహము లోపల గృహమేథు లగు నరు
     లాత్మతత్వము లేశ మైన నెఱుఁగ
రంగనా రతుల నిద్రాసక్తిఁ జను రాత్రి
      పోవు కుంటుంబార్థ బుధ్ధి నహము
ఆ. పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది
సంఘ మెల్లఁ‌దమకు సత్య మనుచుఁ
గాఁపురములు సేసి కడపట జత్తురు
కనియుఁ‌ గాన రంతకాల సరణి

మహారాజా, నువ్వు వేసిన ప్రశ్న గొప్పది.  అన్ని ప్రశ్నల్లోకీ అత్యంత ఉత్తమమైన ప్రశ్న ఇదే.  ఆత్మజ్ఞానులందరికీ ఈ‌ ప్రశ్న పరమానందం కలిగిస్తుంది. 

ఈ‌ ప్రశ్నకి మంచి సమాధానమే ఉంది.  అది అన్ని శుభాలనూ‌ కలిగించేదిగా ఉంటుంది సుమా! 

ప్రపంచంలో తెలుసుకో దగినవి అనేకమైన మంచి విషయాలున్నాయి.  అలాంటి తెలుసుకో దగ్గ విషయా లన్నింటి లోనూ,  ఇదే ముఖ్యమైనది.  ఇదే గొప్పది.

ఈ‌ ప్రపంచంలో ఉన్న సాధారణ గృహస్థులకి కొంచెం కూడా ఆత్మజ్ఞానం ఉండదు.  వాళ్ళకి రాత్రుళ్ళన్నీ‌  స్త్రీసుఖంతోనూ నిద్రాసుఖంతోనూ తెల్లారుతూ ఉంటాయి.   వాళ్ళ పగళ్ళన్నీ కుటుంబం కోసం డబ్బు సంపాదించటంతోనే గడిచి పోతూ ఉంటాయి.

వాళ్ళల్లో‌ ప్రతివాడూ,  నా యిల్లో, నా పెండ్లామో, నా బిడ్డలో, నా చుట్టాలో, నా ఒళ్ళో అనుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు.  ఇలా వీళ్ళు ఇవే తమ తమ జీవితాలకు సర్వస్వం అనుకుంటూ,  ఇవే‌ సత్యం అనుకుంటూ కాపురాలు చేసి చస్తూ ఉంటారు.  కాని ఎవరూ నిజం తెలుసుకోరు. 

వాళ్ళ కళ్ళముందే, అనేక మంది పుడుతూ చస్తూ ఉన్నా,  తమకూ ఇదే గతి అని ఎవరూ దృష్టిలో ఉంచుకోరు.  అందరికీ తెలుసు తమ తమ దేహాలు అశాశ్వతమనీ, ఈ‌ బంధాలేవీ నిలిచేవి కావనీ.  అయినా వాళ్ళకి ఈ సంసారలంపటం మీద ఆసక్తి నిలుస్తోంది కాని సత్యం తెలుసుకుందాం అన్న దృష్టి కలగటం లేదు.

ఇక్కడ మనం అర్థం చేసుకోవలసి విషయాలు కొన్ని ఉన్నాయి.  నిద్రాసక్తి అంటే నిద్రకాదు.  నిద్రపోవాలనే కోరిక.  ఇది సోమరితనానికి సూచన.  అలాగే ఇక్కడ ప్రస్తావించిన వాటిలో ఉన్న కుటుంబం, అంగనారతి మొదలైనవి ఆసక్తి ప్రధానంగా ఉన్నప్పుడు అవి బంధాలు.  ధర్మప్రధానంగా ఉన్నప్పుడు సందర్భోచితంగా కర్తవ్య పాలనంలో‌ భాగాలు.  ఇక్కడ శుకమహర్షి మనుషులు ఆసక్తి ప్రధానంగా జీవించి సత్యం మీద దృష్టి పెట్టక సాధారణ జనం చెడిపోతున్నారని ప్రస్తావించారని గ్రహించాలి మనం.

శుక మహర్షి ఇలా అన్నారు.  మహారాజా, ఈ సంసారం సాధారణ జనానికి బంధంగా ఉంది కదా.  దీన్నించి తప్పించు కోవాలంటే ఒక్కటే ఉపాయం.

క. కావున సర్వాత్ముండు మ
హా విభవుఁడు విష్ణుఁ డీశుఁ డాకర్ణింపన్
సేవింపను వర్ణింపను
భావింపను భావ్యుఁ డభవభాజికి నధిపా

కాబట్టి ఆ ఉపాయం విను మహారాజా.  శ్రీమహావిష్ణువు ఈ చరాచర సృష్టికి అధిపతి. అందుచేత ఈ కనిపించేదీ, కనిపించనిదీ అయిన సృష్టి అంతా ఆయన వైభవమే.  ఆ పరమపురుషు డైన విష్ణువుకు సంబంధించిన కథలు వినాలి.  ఆయననే నిత్యం శ్రథ్థాభక్తులతో సేవించాలి.  మిక్కిలి ప్రేమతో ఆ సర్వేశ్వరుడైన విష్ణువునే మనస్సులో నిత్యం భావించాలి.  ఈ సంసార బంధం నుంచి మోక్షం కోరుకునే వాడు ఆయన నామ, రూప, గుణ, కథా వైభవాల కన్నా తన మనస్సులో అనుసంధానం చేసుకో వలసినది మరేమీ లేదు.  భగవత్సంబంధం కానివి తుఛ్ఛవిషయాలు.  వాటికి దూరంగా ఉండాలి.

విష్ణువు అనగా సర్వము నందూ వ్యాపించి ఉన్న వాడు అని అర్థం.  సర్వాత్ముడు అంటే సర్వ చరాచరాల్లోనూ తానుగా ఉన్నవాడు అని అర్థం.  అందుచేత విష్ణువుని వినటం సేవించటం, భావించటం అనే‌ క్రియలు అంటే మనం చరాచరరూపక మైన జగత్తులో అంతటా విష్ణువునే అవగాహనకు తెచ్చుకోవటం అన్నమాట.  సమస్తమైన రూపాల్లో ఉన్న జీవులూ‌ నిర్జీవుల్లోనూ విష్ణువు అంశను దర్శించ కలగాలి.  అన్ని విషయాల్లోనూ విష్ణుతత్వం గ్రహించి సేవించాలి.  పరస్పరం విష్ణుతత్వాన్ని గ్రహించి శ్రవణమననాదులు చేసుకుంటూ ఉండాలి. మనస్సుల్లో ఆ తత్త్వాన్నే‌ భావించాలి నిత్యమూ.  జీవుల్లో 'నేను' అనే‌ ప్రజ్ఞగా ఉన్నది విష్ణువే అని తెలుసుకోవాలి.  ఇదే మోక్షార్థికి ముఖ్యం అని శుకమహర్షి భావం.

శుకయోగి ఈ సందర్భంగా సాంఖ్యయోగాన్ని ప్రస్తావిస్తున్నారు.  మహారాజా,

ఆ. జనుల కెల్ల శుభము సాంఖ్యయోగము దాని
వలన ధర్మనిష్ఠవలన నయిన
నంతకాల మందు హరిచింత  సేయుట
పుట్టువులకు ఫలము భూవరేంద్ర

ఈ విధంగా విష్ణుతత్వంలో నిలవటానికి సాంఖ్యయోగం చక్కగా ఉపయోగ పడుతుంది.  ఈ‌ సాంఖ్యయోగం వలన ధర్మనిష్ఠ కలుగుతుంది. దానివలన హరి చింత చేయటానికి చిత్తానికి ఇబ్బందులు తొలగుతాయి.  మరణసమయంలో హరిచింత నిలుస్తుంది మనస్సులో.  ఇదే జన్మం ఎత్తినందుకు సాఫల్యత.

సాంఖ్యం అంటే వ్యక్తికి అతీకమైన జ్ఞానం. యుజ్ సంధానే అని అర్థం - అంటే ఇక్కడ జ్ఞానాన్ని ధర్మాశ్రయం ఐన కర్మతో సంధానించటం అన్న మాట సాంఖ్యయోగం‌ అంటే.   జ్ఞానం, కర్మాచరణం అనేవి రెండు చేతుల వంటివి.  ఈ రెండూ‌ సమన్వయంతో పని చేయాలి.  అలాంటప్పుడే చివరిక్షణాల్లో నారాయణస్మరణ చేయగలిగే చిత్తవృత్తి కలుగుతుంది.

తే. అరసి నిర్గుణ బ్రహ్మంబు నాశ్రయించి
విధినిషేధవృత్తి సద్విమలమతులు
సేయు చుందురు  హరిగుణచింతనములు
మానసంబుల నే‌ ప్రొద్దు మానవేంద్ర

రాజా,  సత్పురుషులు, ఈ‌ ప్రపంచంలో ఏది చేయ దగినదీ, ఏది చేయదగనిదీ అన్న ధర్మం (ధర్మం ఈ విధి-నిషేధాల రూపంలో ఉంటుంది) తెలిసి ప్రవర్తించే వారు కాబట్టి వారిని ఈ‌ ఐహిక జగత్తు బాధించలేదు.  సర్వకాల సర్వావస్థల్లోనూ వాళ్ళు నిశ్చింతగా నిర్గుణబ్రహ్మాన్ని ఆశ్రయించి, మనస్సుల్లో శ్రీహరి దివ్యగుణాల్ని భావన చేస్తూ ఉంటారు. 

మహారాజా,  నా తండ్రిగారు వేదవ్యాసుడు.  ఆయన ద్వాపర యుగం చివర్లో ఈ వేదం వంటి భాగవతాన్ని రచించారు.  అది సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపం ఐన కృతి.  దానిని నా చేత మా నాన్నగారు చదివించారు.  మనస్సును పరబ్రహ్మానికి అర్పించి ఈ గ్రంథాన్ని పఠించాను నేను.   ఈ‌ భాగవతంలో అన్నీ ఉత్తమోత్తమమైన కథలే.  నువ్వు కూడా విష్ణుభక్తుడివి.  అందుచేత ఆ భాగవతాన్ని నీకు వినిపిస్తాను.  దీన్ని వినటం వలన నీ విష్ణుగతం అయిన బుధ్ధి మరింత ధృఢం అవుతుంది.
 
ఆ. మోక్షకామునకును మోక్షంబు సిథ్థించు
భవభయంబు లెల్ల బాసి పోవు
యోగి సంఘమునకు నుత్తమ వ్రతములు
వాసుదేవ నామ వర్ణనములు

ఈ భాగవతం శ్రథ్థాభక్తులతో వినటం వలన మోక్షం కోరుకునే వాడికి తప్పక మోక్షం లభిస్తుంది.  మళ్ళీ మళ్ళీ పుట్టటం చావటం అనే మహాభయం నుంచి విముక్తి కలుగుతుంది.  భగవంతుడైన విష్ణువు యొక్క దివ్యనామ స్మరణంతో‌ కూడుకున్న ఈ కథలు వినటం అనేదే యోగులైన వాళ్ళకు ఉత్తమమైన వ్రతదీక్ష.

అందుచేత అటువంటి యోగులు అతి స్వల్పకాలంలోనే మోక్షం సాధించగలరు.

26, ఆగస్టు 2013, సోమవారం

ప్రథమస్కంధం: 36. శ్రీశుకులను పరీక్షిత్తు మోక్షమార్గం కోసం ప్రార్థించటం


ఆవిధంగా వ్యాసమహర్షులవారి కుమారుడైన శుకయోగీంద్రుడు అక్కడికి వచ్చాడు.

వెంటనే, అక్కడ చేరి ఉన్న మును లందరూ వారివారి ఆసనాలు దిగి, శుకయోగికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి తీసుకు వచ్చారు.   ఆ మునులు అందరికీ శుకయోగి ప్రభావం తెలుసు కదా!

పరీక్షిన్మహారాజుకు బ్రహ్మానందం కలిగింది.  అయన శుకయోగికి అతిథి సత్కారాలు చేసి,  సాష్టాంగ దండప్రణామం చేసి, గొప్పగా పూజించాడు.

రాత్రిపూట చూడండి.  ఆకాశం మీద అనేక వేల నక్షత్రాలు మిలమిల లాడుతూ‌ ఉంటాయి.  అవి చూడటానికి ఎంతో బాగుంటాయి.  ఆకాశం ఎంతో అందంగా ఉంటుంది.

కొద్ది సేపటికి చందమామ వచ్చాక?  ఇంక ఆకాశం‌ ఎంత శోభాయమానంగా ఉంటుందో చెప్పతరం కాదు.  అవునా?

అలాగే, అనేక మంది మునులతో కళకళ లాడుతున్న పరీక్షిన్మహారాజుగారి ప్రాయోపవేశ స్థలం ఒక రకంగా నక్షత్రాల గుంపులతో కూడిన ఆకాశంలా ఉంది.  

శుకమహర్షి రాకతో చంద్రోదయం అయినట్లయింది.

అలా శుకమహర్షి నక్షత్ర మండలాలతో కూడుకున్న ఆకాశం మీద ప్రకాశిస్తున్న పూర్ణచంద్రుడిలా ఉన్నాడు.  పోతనగారు రాకాసుధాకరుండు అన్నారు.  రాకా అంటే పౌర్ణమి.  లలితాసహస్రనామాల్లో ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా అని ఒక నామం ఉంది.  అక్కడ ప్రతిపత్తు అంటే పాడ్యమి.  రాకా అంటే పౌర్ణమి.  సుధాకరుడు అని పోతనగారు ఒక సొగసైన మాట అన్నారు. సుధ అంటే అమృతం,  అంటే  నాశనం లేనిది. అమృతత్వం అంటే బ్రహ్మానందమే.  కాబట్టి సుధాకరుడు అంటే బ్రహ్మానందాన్ని కలిగించేవాడు అని అర్థం.  బ్రహ్మానందాన్ని కలిగించే సామర్థ్యం కేవలం పరబ్రహ్మానికే కదా ఉండేది. అంటే శుకయోగి పరబ్రహ్మస్వరూపం అని చెప్పటం‌ అన్నమాట.   మరి సుధాకరుడు అంటే సరిపోయే టప్పుడు రాకా అని విశేషణం అవసరం ఏమిటీ అన్న ప్రశ్న వస్తుంది.  మహాత్ముల సాన్నిహిత్యం వారి నామస్మరణం, వారి ఉపదేశాలు వినటం, వారి శిష్యులతో‌ సంభాషించటం వంటి అనేకరకాలుగా సిథ్థిస్తుంది.  మరి వారే స్వయంగా వచ్చి దర్శనం అనుగ్రహిస్తే?  అది సంపూర్ణ ఫలం అందిస్తుంది కదా?  అందుకే భాగవతంలో  రాకాసుధాకరుండు అని చెప్పటం అన్నమాట.

ఉ. ఫాలము నేల మోపి భయభక్తులతోడ నమస్కరించి భూ
పాలకులోత్తముండు గరపద్మములన్ ముకుళించి నేఁడు నా
పాలిటి భాగ్య మెట్టిదియొ పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేళకు నీవు వచ్చితి వివేకవిభూషణ పుణ్యకీర్తనా

ఆ శుకమహర్షి ముందు,  రాజకులంలోకే ఉత్తముడైన పరీక్షిత్తు నుదుటిని నేలకు తాకించి సాష్టాంగ పడ్డాడు.  ఎంతో భయభక్తులతో ఒక ప్రక్కన నమస్కారం పెట్టి అలాగే నిలబడ్డాడు. (గురువులకూ, దైవానికి సరాసరి ముఖానికి ఎదురుగా నిలబడ కూడదు).  ఈ‌ రోజున నా భాగ్యం ఎంత గొప్పగా పండిందో!   మీరు పరమపావనులు (మీ దర్శనం చేతనే పాపనాశనం కలుగుతుంది అని), మీ‌ కీర్తిని స్మరిస్తేనే అమోఘమైన పుణ్యం వస్తుంది.  ఆత్మానాత్మ వివేకమే అలంకారంగా ఉంటారు మీరు.   మీ‌ అనుగ్రహ భాషణం పరమమైన బ్రహ్మ తేజస్సుని ప్రసరింప జేస్తుంది.ఎంతో‌ గొప్ప అదృష్టం కలిగిందో! సరిగ్గా నాకు అవసరమైన సమయానికి మీరు దర్శనం అనుగ్రహించారు.

మ. అవధూతోత్తమ నేఁడు నిను డాయం‌ గంటి నీవంటి వి
ప్రవరుం బేర్కొకునంతటన్ భసితమౌఁ బాపంబు నా బోఁటికిన్
భవదాలోకన భాష ణార్చన పదప్రక్షాళన స్పర్శ నా
ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే

అయ్యా మీరు అవధూతల్లో  ఉత్తములు. మీ లాంటి బ్రహ్మవేత్తలను స్మరించినంతనే మా బోటి వాళ్ళ పాపాలన్నీ భస్మం ఐపోతాయి.  అలాంటిది మిమ్మల్ని ప్రత్యక్షంగా దర్శించటం, మీ‌ పాద సేవ చేసుకోవటం, మిమ్మల్ని సత్కరించుకోవటం అనే ఆదృష్టం పడితే చెప్పేదేముంది.  అదీ కాక మీతో సంభాషించే అవకాశం దొరకటం అంటే మీ అనుగ్రహంతో ముక్తి లభించటమే అన్న మాట.  నా పుణ్యం‌ పండి,  మీరే స్వయంగా నా దగ్గరకు వచ్చారు.

శ్రీహరిని చూడగానే రాక్షసులంతా సర్వనాశనం ఐపోతారు. మీ పాదస్పర్శ చేతనే సమస్త మహా పాపాలూ నాశనం ఐపోతాయి.

మ. ఎలమిన్ మేనమఱందియై సచివుడై యే మేటి మా తాతలన్
బలిమిం గాచి సముద్రముద్రితధరం బట్తంబు గట్టించె న
య్యలఘుం డీశుఁడు చక్రి రక్షకుడు గా కన్యుల్ విపద్రక్షకుల్
గలరే వేఁడెద  భక్తి నా గుణనిధిం గారుణ్య వారాన్నిధిన్

పరీక్షిన్మహారాజుగారు శ్రీకృష్ణభగవానుని స్మరిస్తున్నారు.  ఏ మహాత్ముడు మా తాతలకి మేనమరదిగా అత్మీయతను పంచి పెట్టాడో,  ఆప్తమిత్రుడైన మంత్రిగా మంచి చెడ్డల్లో‌ తోడుగా ఉన్నాడో, ఆ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నాను.   ఆయన తన ప్రతాప ప్రభావం చేత మా తాతలని కంటికి రెప్పల్లా రక్షించి, వాళ్ళకి నాలుగుసముద్రాల దాకా విస్తరించిన సామ్రాజ్యానికి పట్టం‌ కట్టాడు.  సుదర్శన చక్రధారి ఐన శ్రీకృష్ణస్వామి తప్ప మహా దొడ్డ ఆపదలలోంచి రక్షించగల వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?  ఆయన అసామాన్యుడు, సాక్షాత్తూ జగదీశ్వరుడు.  ఆ కారుణ్యాది సద్గుణమూర్తిని భక్తితో నన్ను రక్షించ మని వేడుకుంటున్నాను. 

రాజు మాటల్లో, ఆ శ్రీకృష్ణులవారే తమ పరమభక్తులైన మిమ్మల్ని, నన్ను రక్షించమని పంపారూ అని భావిస్తున్నాను అని చెప్పటం ఇమిడి ఉంది.

రాజుగారు, ఇలా శ్రీకృష్ణస్తవం చేయటంతో శుకయోగికి చాలా ఆనందం కలిగింది.   అయన హృదయం కృష్ణమయం కదా!

తిరిగి, పరీక్షిత్తు శుకయోగితో ఇలా అంటున్నారు.

సీ.  అవ్యక్తమార్గుండ వైన నీ దర్శన
      మాఱడి పోనేర దభిమతార్థ
సిధ్ధి గావించుట సిధ్ధంబు నేఁ డెల్లి
      దేహంబు వర్జించు దేహధారి
కేమి చింతించిన నేమి జపించిన
      నేమి గావించిన నేమి వినిన
నేమి సేవించిన నెన్నఁడు సంసార
      పధ్ధతి బాసిన పదవి గలుగు
తే. నుండ మనరాదు గురుఁడవు యోగివిభుఁడ
వావుఁ బితికిన తడ వెంత  యంత సేపు
గాని యొక దెస నుండవు కరుణ తోడఁ
జెప్పవే తండ్రి ముక్తికి జేరు తెరువు

మహానుభావా శుకయోగీంద్రా!  అత్యంత గహనమైన నీ యోగమార్గం ఎవ్వరికీ అంతు చిక్కదు. పరబ్రహ్మ స్వరూపుడవైన నీ దర్శనం వృధా కాదు.  తప్పకుండా కోరిన ప్రయోజనం అనుగ్రహిస్తుందని అనుకుంటున్నాను.

శరీరం ధరించిన వాడికి మృతువు తప్పదు.  ఈ వేళో, రేపో అది తప్పకుండా జీవుణ్ణి ఉపాధి నుండి కబళిస్తుంది కదా!

అటువంటప్పుడు.  నా బోటి జీవుడు ఎలా ముక్తి పొందుతాడు?

ఏ తత్త్వాన్ని ధ్యానిస్తే ముక్తి లభిస్తుంది?

ఏ మహామంత్రాన్ని ఉపాసించి జపం చేస్తే ముక్తి లభిస్తుంది?

ఎలాంటి మహత్తరమైన పుణ్యకార్యం చేస్తే ముక్తి లభిస్తుంది?

ఏ దివ్యసత్కథలను వింటే ముక్తి లభిస్తుంది?

ఏ ఏ పుణ్యతీర్థాలు సేవిస్తే ముక్తి లభిస్తుంది?

మిమ్మల్ని విస్తారంగా చెబుతూ కూర్చుండ మనటానికి వీలు లేదు.  మీరేమో ఆవు పాలు పితకటానికి ఎంత సేపు పడుతుందో అంత సేపు కన్నా ఒక్క ఘడియ కూడా ఎక్కడా నిలకడగా ఉండే వారు కాదు.

అయినా దయచేసి,  మీకు వీలున్నంతగా ఈ కాస్సేపటిలోనే నాకు సంసారపధ్దతి నుండి విడుదల పొంది మోక్ష పదవి పొందే ఉపాయం అనుగ్రహించ వలసింది.

ఇలా ఎంతో వినయంగా శుకమహర్షిని పరీక్షిన్మహారాజు వేడుకున్నాడు.

చదువరులారా,  పరీక్షిన్మహారాజుగారు శ్రీశుకయోగీంద్రులను మోక్షమార్గ ప్రశ్న చేయటంతో  మహాభాగవత పురాణంలో ప్రధమస్కంధం సంపన్నం అవుతున్నది.