19, సెప్టెంబర్ 2013, గురువారం

ద్వితీయస్కంధం: 17. బ్రహ్మగారు వర్ణించిన విరాట్పురుషుడి దివ్యవిగ్రహం.

 బ్రహ్మగారు వర్ణించిన విరాట్పురుషుడి దివ్యవిగ్రహం ఎలా ఉన్నదీ శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన దాని శుకయోగీంద్రుడు శౌనకాదులకు నివివరిస్తున్నాడు.

ఏడు ఊర్థ్వలోకాలూ విరాట్పురుషుడి శరీరంలో మొలనుండి పైభాగం.
ఏడు అధోలోకాలూ విరాట్పురుషుడి శరీరంలో మొలక్రింది భాగం.
ఆ భగవంతుడి ముఖం నుండి బ్రాహ్మణులూ, బాహువుల నుండి క్షత్రియులూ, తొడల నుండి వైశ్యులూ, పాదాల నుండి శూద్రులూ జన్మించారు.

భూలోకం అయన నడుము చుట్టూ ఉన్న ప్రదేశం.
భువర్లోకం ఆయనకు నాభిస్థానం.
సువర్లోకం ఆయన హృదయం.
మహర్లోకం ఆయన వక్షస్థలం.
జనలోకం ఆయన కంఠం.
తపోలోకం ఆయన స్తనద్వయం.
సత్యలోకం ఆయన శిరస్సు.
ఇవి ఏడూ ఊర్ధ్వలోకాలు.

అతలలోకం ఆయన మొల దిగువభాగం.
వితలలోకం ఆయన తొడలు.
సుతలలోకం ఆయన మోకాళ్ళు.
తలాతలలోకం ఆయన పిక్కలు.
మహాతలలోకం ఆయన చీలమండలు.
రసాతలలోకం ఆయన పాదాల పై భాగం.
పాతాళలోకం ఆయన పాదాల అరికాళ్ళు.
ఇవి ఏడు అధోలోకాలు.

ఐతే మరి కొంత మంది లోకాల క్రమం వేరుగా సంక్షిప్తంగా చెబుతున్నారు.
భూలోకం భగవంతుడి అరికాళ్ళు.
భువర్లోకం భగవంతుడి నాభి.
స్వర్లోకం భగవంతుడి శిరస్సు.
ఇలా ఈ మూడు విభాగాల్లోనూ మొత్తం పదునాల్గు లోకాలూ ఇమిడి పోతాయి.
ఇక్కడ భూలోకం ద్ర్వవ్యమయ స్వభావం లది. భువర్లోకం శక్తిమయ స్వభావం కలది. స్వర్లోకం ప్రజ్ఞామయ స్వభావం కలది.

భగవంతుడి నోటి నుండి వాక్కూ, దాని అధిదైవతం ఐన అగ్నీ ఉద్భవించాయి.

భగవంతుడి ఏడు ధాతువుల నుండి ఏడు ఛందస్సులు పుట్టాయి.  చర్మం, రక్తం, మాంసం, మేదస్సు, ఎముకలు, మజ్జ, శుక్లము అనేవే ఆ ఏడు ధాతువులు.  రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, నరములు, మజ్జ, ప్రాణం అనేవే సప్తధాతువులని  కొందరి మతం.
ఆయన రోమాల నుండి ఉష్ణిక్ ఛందం పుట్టింది.
ఆయన చర్మం నుండి ధాత్రీ ఛందం పుట్టింది.
ఆయన మాంసం నుండి త్రిష్టుప్ ఛందం పుట్టింది.
ఆయన నరముల నుండి అనుష్టుప్ ఛందం పుట్టింది.
ఆయన ఎముకల నుండి జగతీ ఛందం పుట్టింది.
ఆయన మజ్జ నుండి పంక్తి ఛందం పుట్టింది.
ఆయన ప్రాణం నుండి బృహతీ ఛందం పుట్టింది.

భగవంతుడి రసనేంద్రియం (నాలుక) నుండి హవ్యాలూ , కవ్యాలూ అనే తరగని ఆహారాలు జన్మించాయి.  ఆయన రసనేంద్రియం నుండే తీపీ పులుపూ వగైరా షడ్రుచులూ, జీవుల రసనేంద్రియాలూ జన్మించాయి. ఆయన రసనేంద్రియం నుండి రసాధిపతి ఐన వరుణుడు జనించాడు.

హవ్యం అంటే యజ్ఞంలో దేవతలకి అగ్నిద్వారా అందించే ఆహారం.  కవ్యం అంటే శ్రాధ్దక్రియల్లో పితృదేవతకు సమర్పించే ఆహారం.

భగవంతుడి ముక్కు నుండి వాయుదేవుడు,అశ్వినీదేవతలూ  ప్రభవించారు. అన్ని విధములైన ప్రాణస్పందనలూ,  వాసన చూసే శక్తీ ఆ భగవంతుడి నాసిక నుండే వచ్చాయి.

భగవంతుడి ఛక్షువుల (కన్నుల) నుండి దేవలోకం, బ్రహ్మలోకం, తేజస్సూ, సూర్యుడూ, జీవుల కన్నులూ జన్మించటం జరిగింది.

భగవంతుడి చెవుల నుండి దిక్కులూ, శబ్దమూ, ఆకాశమూ, ప్రాణుల కర్ణేంద్రియాలు ఏర్పడ్డాయి.

భగవంతుడి శరీరం నుండే సమస్తమైన సంపదలూ, వస్తువులూ జన్మించాయి.

భగవంతుడి చర్మం నుండి  స్పర్శ, వాయువు పుట్టా.

భగవంతుడి రోమాల నుండి సమస్త వృక్షజాతీ పుట్టింది. అంటే యూపస్థంభం వంటి వృక్షసంబంధం కల సమస్త మైన యజ్ఞసామాగ్రి కూడా ఆయన రోమాల నుండే జన్మించింది.

భగవంతుడి గోళ్ళ నుండి శిలలూ లోహాలూ ఉత్పన్నం అయ్యాయి.

భగవంతుడి కేశముల నుండి మబ్బులు ఏర్పడ్డాయి.

మెరుపుతీగలు భగవంతుడి మీసాలు.

విష్ణుపరాక్రమం నుండే లోకక్షేమానికీ, లోకపాలకులకూ ఉత్పత్తి.

విష్ణుపాదాల నుండే ఉత్తమమైన వరాలు కలుగుతున్నాయి.

భగవంతుడి జననేంద్రియం నుండి  ప్రజాపతి, పర్జన్యుడు, శుక్రము, జలము,  సంతాన శక్తి,  చతుర్విధపురుషార్థములు, మనస్సుకు వినోదానందపు అనుభూతులు కలగటం జరిగింది.

ఆయన విసర్జనావయవం నుండి జీవులకి విసర్జనావయవమూ, యముడు, మిత్రుడు అనే దేవతల ఉదయమూ జరిగింది.

ఆయన ఆసనం నుండి మృత్యువు, హింస, ఆపద, నరకం జనించాయి.

భగవంతుడి వీపు నుండి అవమానం , అధర్మం, అజ్ఞానం , చీకటి కలిగాయి.

భగవంతుడి శరీరంలో నాడుల వలన ప్రపంచంలోని  నదీప్రవాహాలు పుట్టాయి.

పర్వతాలు ఆయన ఎముకలే.

భగవంతుడి గర్బగోళమే మూలప్రకృతికి ఆవాసం.  అదే  ప్రపంచంలో సముద్రం. అదే జీవులకు అన్నాశయం.

భగవంతుడి హృదయం నుండి మనోమయమైన లింగశరీరం కలిగింది.

ఇదీ బ్రహ్మగారు వర్ణించిన ఈశ్వరుడి విరాడ్విగ్రహం. ఇంకా ఆయన నారదుడితో ఇలా అన్నారు.

నాకూ శివుడికీ కూడా భగవంతుడి విరాద్విగ్రహమే నివాసస్థానం. నా పుత్రులైన నీవూ, సనక సనందనాదులకూ కూడా ఆ విరాడ్విగ్రహమే స్థానం.  ప్రపంచంలోని సత్యం, ధర్మం, బుధ్ది, తత్తజ్ఞానం అనే వాటికీ అదే నెలవైన చోటు.

మనుషులు, దేవతలు, పితృదేవతలు, గంధర్వాది దేవ జాతులు, అప్సరసలు, రాక్షసులు, పాములు  , ఏనుగులు, లేళ్ళు వంటి జంతువులు, సమస్త భూచరాలు, మేఘాలు, మెఱుపులు, నదులు, జలచరాలు, సముద్రాలు, నక్షత్రాలు, గ్రహాలు, వాటిలో ఉన్న సమస్త తేజస్సూ సంపదలూ, నువ్వూ, నేనూ, శివుడు అంతా విష్ణువు యొక్క విభూతిలో భాగాలే  కాని వేరు కాదు.  ఈ‌ బ్రహ్మాండం ఆయనలో ఒక  జానెడు భాగం అంత కొలత అనుకో.  విశ్వాన్ని నడిపించే కాలమూ, దానిలో ముందు గడచిన ప్రపంచాలూ, ఇప్పటి సృష్టీ, రాబోయే సృష్టీ అంతా విష్ణువులో భాగమే. ఇది చాలా  గహనమైన విషయం.  మన బుధ్ధికి అందేది కాదు.

క. మండలము లోన భాస్కరుఁ
డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాండము లోపన నచ్యుతుఁ
డుండి బహిరంతరముల నొగి వెలిగించున్


సూర్యదేవుడు ఆసూర్యబింబంలో ఉండి లోకాలన్నింటికీ వెలుగుని ప్రసాదిస్తున్నాడు. అదే పోలికగా, బ్రహ్మండంలో ఉండి విష్ణు బ్రహ్మాండానికి తన తేజస్సుని అందించి నడిపిస్తున్నాడు. అంతే కాదు, ఆయన బ్రహ్మాండంలో ఉండటానికి పరిమితం కాదు, బ్రహ్మాండం‌ బయటకూడా ఆయన తేజస్సు విస్తరించి ఉంది.

ఇది పరిమితమైన పోలిక. సూర్యుడు వేరు సూర్యబింబం వేరు. సూర్యబింబం సూర్యుడికి దేహం. దానిలో ఉన్న భగవంతుడి తేజస్సు పేరు సూర్యుడు. పోలిక ఇక్కడ అపాలి. సూర్యుడికి బింబం వినా ఉనికి చెప్పబడదు.  కాని ఈ బ్రహ్మాండం భగవంతుడి శరీరం కాదు. ఆయన నిజేఛ్ఛ చేత దాన్ని సృష్టించి లీలగా దానిలో ప్రవేశించాడు. ఈ  బ్రహ్మాండం, ఈశ్వర విభూతిలో ఒక అంశ మాత్రమే.  ఆయన బ్రహ్మండానికి పరిమితం కాక దాని వెలుపలా ఉన్నాడు.

3 కామెంట్‌లు: