7, సెప్టెంబర్ 2013, శనివారం

ద్వితీయస్కంధం: 11. సకామ నిష్కామ సాధనలు

పరీక్షిన్మహారాజా నువ్వు ముక్తి కలిగే‌ మార్గం అని అడిగావు.  వేదం సద్యోముక్తి, క్రమముక్తి అని రెండు విధాల మార్గాల్నీ చెబుతోంది. ఈ‌ రెండు మార్గాలనూ పూర్వం‌ బ్రహ్మగారికి విష్ణుమూర్తి ఉపదేశించాడు.

మొదట భగవంతుడైన వాసుదేవుడి నుండి బ్రహ్మ జన్మించాడు. ఆయనకు విష్ణువు ఈ‌ ముక్తి మార్గాల్ని ఉపదేశం చేసాడు.  వేదంలో ఉండే మంత్రాలు గానం చేయబడుతాయి కాబట్టి వాటిని వేదగీతలు అని చెబుతారు. విష్ణువు యొక్క విరాడ్విగ్రహాన్ని పురుషసూక్తం చెబుతున్నది. అంతర్యామిత్వం సాధించటం గురించి ఈశావస్యాది ఉపనిషత్తులలోనూ విష్ణు సరస్వతీ సూక్తాల్లోనూ చూడవచ్చును. ఇలా విరాడ్విగ్రహాన్ని ధారణ చేసి ముక్తి సంపాదించటం క్రమముక్తి.  ప్రాణాదులను ఉపసంహరించి పాపంచిక సంగం విసర్జించి భక్తితో పరమాత్మలో ఐక్యం కావటం సద్యోముక్తి. 

మోక్షసంపాదనకు అనేక విధాలైన మార్గాలున్నాయి.  కాని అన్నింటికన్నా సులభమైనది భక్తి యోగం.  బ్రహ్మగారు ముమ్మారుగా వేదాన్ని విమర్శించి అన్ని విధానాలకన్నా భక్తియోగం గొప్పదని నిర్థారించుకుని విష్ణువుని భక్తితో ధ్యానం చేసాడు. తన అస్తిత్వాన్ని విష్ణువుకే సమర్పించి సమస్తమైన వికారాలూ నశించి విశుధ్ధు డయ్యాడు.

సమస్తమైన జీవులకూ ఈ విధానం పనికి వస్తుంది.  చూడు మహారాజా, ఈ‌ లోకం లోపలికి  వచ్చాక ప్రతి జీవి తన చుట్టూ తన దైన ప్రపంచాన్ని సృష్టించు కుంటోంది కదా? మళ్ళీఆసంసారకూపంలో చిక్కుపడి బయటకు రాలేక దిక్కు తోచక తన్నుకుంటోంది కదా? అందు చేత తన మనస్సుతో తాను కల్పించుకున్న ప్రపంచానికి తానే బ్రహ్మ అవుతున్న జీవుడు, ఆది బ్రహ్మ గారి లాగా విష్ణువును ధ్యానించి ఆయనలో తన ప్రజ్ఞను ధారణ చేసి తరించ వచ్చును.  అలా ధారణ చేసిన వాడి మనస్సు విష్ణుమయం అవుతుంది.  అతడికీ వికారాలన్నీ‌ నశిస్తాయి.

అందరు జీవుల్లోను 'నేను' అనే‌ ప్రజ్ఞగా దేవుడు ఉంటాడు.  తనకు బుధ్ధి అనే‌ ప్రజ్ఞావిషయంగా కనబడేది నిశ్చయంగా ఈ‌శ్వరుడే. ఈ బుధ్ధిని విష్ణువు యొక్క విభూతిగా భావించి ఆయననను భక్తితో ధ్యానించటం ఉత్తమం.  నిత్యమూ సేవించ దగిన వాడూ, నమస్కరించ దగిన వాడు విష్ణువే అని తెలుసుకోవాలి.  సకల సృష్టిలోని జీవులందరి లోపల ఉన్నదీ ఆయనే.  ఈ‌ సృష్టికి నియమాలు ఏర్పరచి నడిపేదీ ఆయనే. ఇక్కడ జరిగే సమస్తమూ ఆయన లీలా విశేషమే. కనిపించే సమస్తమూ ఆయన విభూతి విశేషమే.  అందు చేత విష్ణుకథల పట్ల ఆసక్తి గలిగి ఆయనను నిత్యం భావించుకుంటూ విష్ణుమయమైన దేహమూ, ఇంద్రియాలూ , మనస్సులతో సంచరించిన వాడికి చివరికి ఆయన సాన్నిధ్యం లభిస్తుంది.  ఇదే‌ మనిషి జన్మ ఎత్తిన వాడు చేయవలసిన నిత్య సాధన.  ఇలా నాకు ఇది అంటూ ఏదీ‌ ఎన్నడూ కోరకుండా ఇలా సమస్తమూ విష్ణుమయమంగా జీవించటమే నిష్కామ సాధన. 

ఐతే అందరికీ తగినంత పరిపక్వత సులభంగా రాదు.  కాబట్టి ఎంత వద్దనుకున్నా కోరికలు కలగటమే వాటిని పొందేందుకు ప్రయత్నించటమూ తప్పదు.  అది కూడా సాధనకు ఉపయోగించు కోవటమే సకామ సాధన.  దాని విషయం చెబుతాను విను.  దీనిలో విషయం ఏమిటంటే కోరికలు కలిగాక వాటిని ఈశ్వర విభూతుల యందు ధారణం చేసి సిధ్ధింప జేసుకోవటం అనేది విధానం.


కోరిక
ఉపాస్య విభూతి
సంతానం
ప్రజాపతి
భోజనం
అదితి
స్వర్గం
ఆదిత్యులు
రాజ్యం
విశ్వేదేవతలు
పజాక్షేమం
సాధ్యులు
సంపదలు
దుర్గ
అధికారం
అగ్ని
వివిధ వస్తువులు
వసువులు
ప్రతాపం
రుద్రుడు
దీర్ఘాయువు
అశ్వినీ దేవతలు
దేహపుష్టి
భూదేవి
ప్రతిష్ట
భూమ్యాకాశ దేవతలు
సౌందర్యం
గంధర్వులు
స్త్రీలాభం
ఊర్వశి
సర్వాధిపత్యం
బ్రహ్మ
కీర్తి
యజ్ఞపురుషుడు
ధనసంచయం
ప్రచేతసుడు
విద్య
శివుడు
దాంపత్యసౌఖ్యం
ఉమాదేవి
ధర్మార్థకామాలు
విష్ణువు
వంశవిస్తరణ
పితృదేవతలు
రక్షణ
యక్షులు
బలం
మరుద్గణాలు
రాజరికం
మనువులు
శత్రునాశనం
కోణపాలుకుడనే‌ రాక్షసుడు
భోగాలు
చంద్రుడు


అలా కోరికకు తగిన దేవతలను ఆశ్రయించి ఫలితాలు పొందవచ్చును. 
ఐతే ఇలా కామ్యఫలితాలకోసం ఆశ్రయించ బడిన దేవతలు ఇచ్చే ఫలితాలు బంధవిముక్తికి తోడ్పడేవి కావు కాబట్టి, సరియైన మార్గం అంటె ఒకే‌ ఒకటి

క.  కామింపకయును సర్వముఁ
గామించియు నైన ముక్తిఁ గామించి తగన్
లో మించి పరమ పురుషుని
నేమించి భజించు దత్త్వనిపుణుం డధిపా

మహారాజా! ఏమీ‌ కోరికలు లేని వాడికీ,  అన్నీ‌ తనకు కావాలని ఆశపడే వాడికీ,  కేవలం ముక్తి ఒక్కటే తనకు ఆశ అని నిలబడ్డ వాడికీ అందరికీ‌ కూడా ఉత్తమోత్తమం ఐనది ఒక్కటే.  అది పరమపురుషుణ్ణే నమ్ముకోవటం అని తత్త్వజ్ఞుడు ఆయన్ను భజిస్తాడు.

నీకు కోరికలు లేవా పరమపురుషుణ్ణి నమ్మి ఉండటం మించి మరేమీ పని లేదు నీకు.  అది కావాలీ ఇది కావాలీ అన్న భ్రాంతి ఉందా? వాళ్ళనీ వీళ్ళనీ‌ ఎందుకు - పరమేశ్వరుడినే‌ అడుగు.  ఆయన నీ‌ అర్హతని విచారించి ఇస్తాడు, పుచ్చుకో.  ముక్తి ఒక్కటే‌ కావాలా,  అది పరమ పురుషుడికే చెప్పు.   ఈ విషయం గట్టిగా రూఢి చేసుకుని తత్త్వం‌ ఇదే‌అని బాగా తెలుసు కున్న వాడు నిశ్చయంగా పరమపురుషుణ్ణి నమ్మి నిశ్చింతగా ఉంటాడు అని శుక యోగి చెప్పాడు.

మ. అమరేంద్రాదుల గొల్చు భంగి కనుఁడా యబ్జాక్షు సేవింపఁగా
విమలజ్ఞానవిరక్తి ముక్తు లొదవున్ వేయేల భూనాథ త
త్కమలాధీశ కథాసుధారస నదీ కల్లోలమాలా పరి
భ్రమ మెవ్వారికి నైనఁ గర్ణయుగళీ పర్వంబు గాకుండునే

ఇంద్రాదుల్ని పూజించి నట్లుగా సర్వాంతర్యామి ఐన విష్ణువునే పూజించ వచ్చును కదా? ఇంద్రాదులేమి ఇచ్చినా అశాశ్వతం స్వల్పం. అదే విస్ణువును సేవిస్తే కలిగేది నిర్మలమైన జ్ఞానమూ, సంసారం పట్ల పూర్తి విరక్తీ, చివరకు మోక్షమూ.  విష్ణుకథామృతం అనేది ఒక దివ్య గంగాప్రవాహం. ఆ మహానదీ తరంగాల హోరు ఎవ్వరికైన వీనుల విందుకాదా?

ఇంద్రాది దేవతలని విధివిధానంతో పూజిస్తే వాళ్ళకు తగిన ఫలితం ఇచ్చి తీరాలనే నియమం ఉంది. కాని అవి స్వల్పాలూ అల్పాలూ ఐన ఫలితాలు.  విష్ణువును పూజించటం కాదు మనఃపూర్వకంగా నిత్యమూ సేవించాలి.  అలా చేస్తే అహంకార మమకారాలు తొలగి వైరాగ్యమూ ముక్తీ లభిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి